హైదరాబాద్: మూడు ఫార్మెట్లలో టీమిండియాకు విరాట్ కోహ్లీ కెప్టెన్గా వ్యవహరించే సమయం ఆసన్నమైందని మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. గత రెండేళ్లుగా టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్గా అద్భుతమైన ఆటతీరుని కనబరుస్తున్న సంగతి తెలిసిందే.
కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కోహ్లీ అద్భుతమైన ఆటతీరుతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ధోనిని తప్పించి మూడు ఫార్మెట్లలో కెప్టెన్సీ బాధ్యతలను కోహ్లీకి అప్పగించాల్సి సమయం వచ్చిందని క్రికెట్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా 2016 కోహ్లీకి బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది కోహ్లీ అటు కెప్టెన్గా, ఇటు ఆటగాడిగా అనేక రికార్డులు సృష్టించాడు. కెప్టెన్ అయిన తర్వాతే కోహ్లి మరింతగా రాటుదేలాడా? అన్న సందేహం కూడా కలుగుతోంది. ఈ మధ్య కాలంలో కోహ్లీ ఇన్నింగ్స్ను చూస్తే టెస్టులతో పాటు వన్డేల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.
ముంబై వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ అనంతరం టీవీ షోలో పాల్గొన్న సెహ్వాగ్ బహిరంగంగానే కోహ్లీ నాయకత్వాన్ని సమర్ధించాడు. మూడు ఫార్మెట్లలో భారత జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరిచేందుకు కోహ్లీ తయారై ఉన్నాడని, సెలక్టర్లు ఆ బాధ్యతలను కోహ్లీకి అప్పగిస్తే సమర్ధవంతగా నిర్వహించగలడని సెహ్వాగ్ తెలిపాడు.
ప్రస్తుతం టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్గా ధోని ఉన్న సంగతి తెలిసిందే. అయితే నానాటికీ కోహ్లీ తన ప్రదర్శనను మెరుగుపరచుకోవడంతో ధోని కెప్టెన్సీ ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. మరో రెండున్నరేళ్లలో ఇంగ్లాండ్లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాకు ఎవరు నాయకత్వం వహించాలన్నది కీలక ప్రశ్నగా మారింది.
ఉపఖండం బయట టీమిండియా ఆడిన చివరి వన్డే సిరిస్ ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ వన్డే సిరిస్లో టీమిండియా 4-1తో ఓటమి పాలైంది. అయితే ధోని, కోహ్లీలు ఇద్దరూ భారత్కు మరుపురాని విజయాలను అందించినవారే. కివీస్తో ముగిసిన వన్డే సిరిస్లో కోహ్లీ సేవలను మ్యాచ్ సమయంలో తాను ఉపయోగించుకుంటున్నట్లు ధోని బహిరంగంగానే వెల్లడించాడు.
టెస్టు క్రికెట్కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న కోహ్లీ టీమిండియాకు వరుసగా ఐదు టెస్టు సిరిస్ విజయాలను అందించాడు. ఈ క్రమంలో మూడు ఫార్మెట్లకు కోహ్లీని కెప్టెన్గా చేయాలంటూ పలువురు మాజీలు గళం విప్పారు.
'ధోనీ కెప్టెన్గా కొనసాగించాలా? లేదా మార్పులు చేయాలా? అన్నది త్వరలోనే తేలిపోయే అవకాశముంది. వచ్చే ఏడాది వేసవిలో ఇంగ్లాండ్లో చాంపియన్స్ ట్రోపీ నాటికి ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశముంది. అప్పుడే సెలక్టర్లు 2019 వరల్డ్ కప్ వరకు ఎవరు జట్టు కెప్టెన్గా ఉండాలో నిర్ణయించే అవకాశముంది' అని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.