హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై శ్రీలంక మాజీ ఆటగాడు అరవింద డిసెల్వా ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే.. తనకు వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ గుర్తుకొస్తున్నాడని డిసెల్వా అన్నాడు. కొలంబో వేదికగా రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంకపై టీమిండియా ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ విజయంతో మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇంకో టెస్టు మిగిలుండగానే 2-0తో సిరిస్ను కైవసం చేసుకుంది. భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు అనంతరం డిసెల్వా మీడియాతో మాట్లాడాడు. 'కోహ్లీ తన బ్యాటింగ్ శైలితో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్ను తలపిస్తున్నాడు. కోహ్లీ సారథ్యంలోకి టీమిండియా సరికొత్త శిఖరాలను అందుకోవడంలో ఏ మాత్రం అనుమానం లేదు' అని డిసెల్వా అన్నారు.
'ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్లను అతను ఎదుర్కొన్న తీరు చాలా ప్రత్యేకం. గవeస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ మాదిరే భారత క్రికెట్ రాతను మార్చి, దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే సత్తా కోహ్లీకి ఉంది' అని డిసెల్వా అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఆత్మవిశ్వాసం, దూకుడుతోనే కోహ్లీ తన ఆటలో మెరుగైన ఫలితాలను రాబట్టగలుగుతున్నాడని అన్నాడు.
కుమార సంగక్కర, మహిళా జయవర్దనేల వీడ్కోలు అనంతరం శ్రీలంక క్రికెట్ పతనం దిశగా సాగుతోండటం తనకు ఎంతో ఆవేదన కలిగిస్తోందని, మళ్లీ శ్రీలంక జట్టు గాడిలో పడాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని డిసిల్వా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.