హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్లో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ సేన ఓటమి పాలైనా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ టీమిండియాకు మద్దతుగా నిలిచాడు. ఈ సిరిస్లోని మిగతా టెస్టుల్లో టీమిండియా కచ్చితంగా పుంజుకుంటుందని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.
తొలి టెస్టులో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా 333 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఆ టెస్టులో కెప్టెన్ కోహ్లీ 0, 13 పరుగులు మాత్రమే చేశాడు. అయినా సరే ఆస్ట్రేలియాపై సచిన్ కంటే విరాట్కే మెరుగైన రికార్డు ఉందని దాదా గుర్తు చేశాడు.
ఆస్ట్రేలియాను వాళ్ల సొంత గడ్డపై ధీటుగా ఎదుర్కొన్నాడని తెలిపాడు. అంతేకాదు కోహ్లీ వరుసగా నాలుగు టెస్టు సెంచరీలు చేశాడని చెప్పుకొచ్చాడు. ఇది సచిన్కు కూడా సాధ్యంకాలేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో అత్యుత్తమ జట్లు అన్నింటి పైనా విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది.
'కోహ్లి కూడా మానవమాత్రుడే. అతడూ ఓ రోజు విఫలం కావాల్సిందే. పుణే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లోనూ తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో అతడు పేలవ షాట్ ఆడాడు. అయితే గతంలో ఆసీస్ పర్యటనలో తను సాధించిన వరుస నాలుగు సెంచరీలను గమనించండి. సచిన్ కూడా అలా చేయడం నేను చూడలేదు' అని గంగూలీ తేల్చి చెప్పారు.
ప్రస్తుతం టీమిండియాలో నాణ్యమైన బౌలర్లు ఉన్నారన్న సౌరభ్ గంగూలీ సిరీస్ను కచ్చితంగా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్ చాలా సుదీర్ఘమైందని, ఒక్క ఓటమికే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.