హైదరాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై బాల్ టాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ బాల్ టాంపరింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ బ్రిటిష్ దిన పత్రిక 'ది డెయిలీ మెయిల్' మంగళవారం ఓ కథనాన్ని ప్రచురించింది.
హోబర్ట్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ పా డుప్లెసిస్ బాల్ టాంపరింగ్కు పాల్పడటంతో ఐసీసీ అతడికి మ్యాచ్లో వంద శాతం జరిమానా విధించిన మరుసటి రోజునే కోహ్లీపై ఈ వార్తలు వార్తలు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
తన నోట్లో ఉన్న తెల్లటి పదార్థాన్ని తీసి బంతికి అద్దుతూ దానికి మెరుపు తెచ్చేందుకు కోహ్లీ ప్రయత్నించాడని అందుకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. అందులో కోహ్లీ కుడి చేతిని నోట్లో పెట్టుకోవడం, దాంతో బంతిని రుద్దుతుండగా టీవీ కెమెరాలు బంధించాయి.
రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఓటమి పాలైన తర్వాత బ్రిటన్ పత్రిక ఈ కథనం రాయడంపై పలువురు మాజీలు మండిపడుతున్నారు. కోహ్లీపై కావాలనే ఆరోపణలు చేస్తోందన్న విమర్శలు గుప్పించారు. దీనిపై ఇంగ్లాండ్ జట్టు ఫిర్యాదు చేయలేదు. దీంతో కోహ్లీపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవేనని అంటున్నారు.
ఐసీసీ నియామవళి ప్రకారం టెస్టు మ్యాచ్ ముగిసిన ఐదు రోజుల్లో బాల్ టాంపరింగ్కు పాల్పడిన ఆటగాడిపై ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే రాజ్కోట్ టెస్టు ఈ నెల 13వ తారీఖున ముగిసింది. దీనిని బట్టి చూస్తే ఇంగ్లాండ్ ఫిర్యాదు చేయాలనుకుంటే 18వ వరకు ఆ సమయం ఉంది.
— mark boucher (@markb46) November 22, 2016
అయితే, ఈ పది రోజుల్లో కోహ్లీపై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్పై భారత్ 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో విశాఖ టెస్టు ఓటమిని తట్టుకోలేకే బ్రిటన్ మీడియా కోహ్లీపై కావాలనే విమర్శలు చేస్తోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.