హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో కొత్తగా క్రికెట్ సలహా కమిటీ ఏర్పాటైంది. ఏప్రిల్ 12న జరిగిన హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రికెట్ సలహా కమిటీలో టీమిండియా మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు, పూర్ణిమారావులను సభ్యులుగా ఎంపిక చేసినట్లు హెచ్సీఏ ఒక ప్రకటనలో పేర్కొంది.
సలహా కమిటీలో ఉండేందుకు లక్ష్మణ్, రాజు, పూర్ణిమ అంగీకరించినట్లు హెచ్సీఏ పేర్కొంది. తాము అడిగిన వెంటనే అంగీకరించిన వీరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు హెచ్సీఏ కార్యదర్శి టి.శేష్ నారాయణ్ తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అభివృద్ధి కోసం ఎపెక్స్ కౌన్సిల్కు సలహా కమిటీ మార్గనిర్దేశనం చేస్తుంది.
అంతేకాదు ఈ కమిటీ సభ్యులు అపెక్స్ కౌన్సిల్కు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. 'కమిటీలో భాగం పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. హైదరాబాద్ క్రికెట్ భవిష్యత్ మరింత పటిష్టంగా ఉండేందుకు ఈ కమిటీ ఉపయోగపడుతుంది' అని వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.
ఇక క్రికెట్ వ్యవహారాల కోసం ఇటీవల ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్కు సహాయంగా ఉండేందుకు తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు వెంకటపతి రాజు తెలిపాడు. హైదరాబాద్ క్రికెట్కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. అలాగే అపెక్స్ కౌన్సిల్ మహిళా క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరమని పూర్ణిమ అన్నారు.
'సలహా కమిటీకి నన్ను ఎంపిక చేయడం ద్వారా ఎపెక్స్ కౌన్సిల్ మహిళల క్రికెట్కు ప్రాధాన్యమిస్తుందని స్పష్టమైంది. తెలంగాణలో మహిళల క్రికెట్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా' అని పూర్ణిమ చెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మార్చి 31న హెచ్సీఏ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ అధ్యక్షుడిగా నూతన ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైన సంగతి తెలిసిందే.