హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈడెన్ గార్డెన్స్లో గంట మోగించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ క్రమంలో గురువారం మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి భారత మహిళల జట్టు ఆల్రౌండర్ జులన్ గోస్వామి ఈ గంట మోగించారు. దీనికి సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ తరహాలోనే గంట మోగించి మ్యాచ్ ప్రారంభిచాలన్న ఆలోచనతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడి హోదాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2016లో ఈడెన్ గార్డెన్స్లో ఈ గంటను ఏర్పాటు చేయించిన సంగతి తెలిసిందే.
Former #TeamIndia batsman @virendersehwag and @BCCIWomen all-rounder @Jhulan_Goswami ring the bell at Eden Gardens #INDvAUS pic.twitter.com/1azydR0rXX
— BCCI (@BCCI) September 21, 2017
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా కోహ్లీసేన బరిలోకి దిగింది. గత కొన్ని రోజులుగా కోల్కతాలో వర్షాలు కురుస్తుండటంతో పిచ్ బ్యాటింగ్ అనుకూలించే అవకాశం ఉంది. మరోపక్క ఆసీస్ మాత్రం జట్టులో రెండు మార్పులు చేసింది.
ఫాల్కనర్, జంపా స్థానంలో రిచర్డ్సన్, అగర్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ వన్డే ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్కు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే స్టీవ్ స్మిత్కు ఇది 100వ వన్డే. ఈ స్టేడియంలో స్మిత్కు గతంలో ఆడిన అనుభం లేదు. దీంతో ఈ పిచ్పై జరిగిన మ్యాచ్లకు సంబంధించిన వీడియోలను ఇప్పటికే చూశానని బుధవారం జరిగిన మీడియా సమావేశంలో చెప్పాడు.
ఇక, తొలి వన్డేలో గెలిచి ఊపుమీదున్న టీమిండియా రెండో వన్డేలో కూడా ఆస్ట్రేలియాను చిత్తు చేసేందుకు సన్నద్ధమైంది. ఈ వన్డేలో భారత్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లో కనుక కోహ్లీసేన విజయం సాధిస్తే ఐదు వన్డేల సిరిస్లో పట్టు చిక్కినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు గత కొన్ని రోజులుగా కోల్కతాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ వన్డేకి వరుణుడి ముంపు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వర్షం మ్యాచ్కు అడ్డంకిగా మారవద్దని అభిమానులు కోరుకుంటున్నారు.