హైదరాబాద్: వెస్టిండిస్ కోచ్ స్టువర్ట్ లా ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. నిబంధలను ఉల్లంఘించినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. డొమెనికా వేదికగా వెస్టిండీస్, పాక్ జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో టెస్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది.
వెస్టిండీస్, పాకిస్థాన్ జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టులో వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా ఐసీసీ నిబంధనల్ని ఉల్లంఘించాడు. టెస్టు మ్యాచ్ ఆఖరి రోజు రెండో సెషన్లో షేన్ డోరిచ్ అవుటైన తర్వాత లా ధర్డ్ అంపైర్ గదిలోకి వెళ్లాడు.
ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించిన థర్డ్ అంపైర్ను ప్రశ్నించడంతో పాటు గది నుంచి వెళ్లేటప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆర్టికల్ 2.1.5 ప్రకారం ఐసీసీ నియమావళిని ఆటగాళ్లతో పాటు ఆటగాళ్ల సహాయ సిబ్బంది అంతర్జాతీయ మ్యాచ్లో అంపైర్ల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది.
దీంతో వెస్టిండిస్ కోచ్ స్టువర్ట్ లాపై ఐసీసీ మ్యాచ్ రిఫరీలతో పాటు ఎలైట్ ప్యానెల్ చర్యలు తీసుకుంది. దీంతో పాటు స్టువర్ట్ లా యొక్క క్రమశిక్షణా రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ చేర్చబడింది.