సిడ్నీ: అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ వన్డే క్రికెట్కు ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తారా? అనేది ఇటీవల ఆసక్తికర అంశంగా మారింది. అయితే, ధోనీ ఎప్పుడూ తన వన్డే రిటైర్మెంట్ ప్రకటిస్తారనేది ఎవరికీ తెలియదు. రిటైర్మెంట్పై మీడియా అడిగిన ప్రశ్నకు ధోనీ నవ్వుతూ ఆసక్తికర సమాధానమిచ్చారు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో వన్డే తర్వాత గత శనివారం మీడియా రిటైర్మైంట్పై ధోనీని ప్రశ్నించింది. వన్డే అంతర్జాతీయ క్రికెట్పై ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? అని ధోనీని ప్రశ్నించింది మీడియా.
'దీని(రిటైర్మెంట్) కోసం ఒక పిల్(పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్) వేయండి' ఆ తర్వాత స్పందిస్తా' అని పై మహేంద్ర సింగ్ ధోనీ సమాధానమిచ్చారు. ఇంతకుముందు కూడా ఇలాంటి సమాధానమే ఇచ్చారు ధోనీ. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో ఓటమిపాలైన తర్వాత కెప్టెన్సీని వదులుకుంటున్నారా? అని మీడియా ప్రశ్నించింది.
దీనికి స్పందిస్తూ.. 'నా ప్రదర్శనను ఊటంకిస్తూ నా కెప్టెన్సీపై పిల్ వేయండి' అని ధోనీ సమాధానమిచ్చారు. డిసెంబర్ 2014 ఆస్ట్రేలియా పర్యటనలో హఠాత్తుగా టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ధోనీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనను బిసిసిఐ ప్రకటించింది. ఆ సిరీస్ మధ్యలోనే ధోనీ తప్పుకున్నాడు.
'ఎవరి నాయకత్వంలో టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా నెం.1 స్థానాన్ని దక్కించుకుందో ఆయన టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. టెస్ట్ మినహా అన్నీ ఫార్మాట్లలో ఆయన కొనసాగుతారు' అని డిసెంబర్ 30, 2014న బిసిసిఐ ప్రకటించింది. అదే తరహాలోనే అంతర్జాతీయ వన్డే క్రికెట్కూ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి జనవరి 26 నుంచి జరిగే 2అంతర్జాతీయ టీ20 మ్యాచులపైనే ధోనీ దృష్టి సారిస్తున్నాడు.
ప్రతి సారీ ఎలా ఆడతాను... నా తలపై రాసుందా
టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలా సార్లు స్లాగ్ ఓవర్లలో క్రీజులో ఉండి పరుగుల వరద పారించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో కొంత విఫలమవుతున్నాడు ధోనీ. ఈ నేపథ్యంలో ధోనీ మాట్లాడుతూ.. ఒకింత అసహనాన్ని ప్రదర్శించాడు. ప్రతి ఒక్కరి లక్ష్యం గెలిపించడమేనని, అయితే, ప్రతి సారీ దూకుడుగా ఆడటం సాధ్యం కాదని అన్నాడు.
బౌన్సర్ బాల్ను హెలికాప్టర్ షాట్ కొట్టలేమని, యార్కర్ను సిక్స్గా మలచలేమని అన్నాడు. సిక్స్ కొడితే గొప్పగా చెప్పుకునే వారు, అదే బాల్కు అవుట్ అయితే, 'అలా కొట్టడం అవసరమా?' అని విమర్శిస్తారని అన్నాడు. ఎలా కొడతానన్నది తన నుదిటిపై ఏమైనా రాసుందా? అని ప్రశ్నించిన ధోనీ, ఎప్పుడూ జట్టును గెలిపించడం సాధ్యం కాదని కాస్తంత గట్టిగానే చెప్పాడు.