హైదరాబాద్: వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్లో ఆడటం కోసమే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో టెస్టుకు దూరమయ్యాడని ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్మెన్ బ్రాడ్ హాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం గుజరాత్ లయన్స్ జట్టుకి కోచ్గా ఉన్న ఆయన, ఫాక్స్ స్పోర్ట్స్ న్యూస్తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ధర్మశాల టెస్టు: కోహ్లీ దూరం, 54 టెస్టుల తర్వాత రహానే
ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ తొలి మ్యాచ్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభంనాటికి తనకేమీ సమస్యలు ఉండరాదనే కోహ్లీ చివరి టెస్టు ఆడట్లేదని ఆయన చెప్పాడు.
ఒకవేళ కోహ్లీ తీవ్ర గాయాలతోనే చివరి టెస్టు మ్యాచ్కి దూరమైన మాట నిజమే అయితే, మరికొన్ని రోజుల్లో గుజరాత్ లయన్స్ జట్టుతో జరిగే మ్యాచ్లో కూడా కోహ్లీ ఆడకూడదని హాగ్ అభిప్రాయపడ్డాడు. టెస్టు మ్యాచ్ని ఆడకుండా, ఆ తర్వాతి వారంలో బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో గుజరాత్ లయన్స్ జట్టుతో జరిగే మ్యాచ్లో పాల్గొంటే, అది చాలా దరిద్రంగా ఉంటుందని అభివర్ణించాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలుచుకునేందుకు కోహ్లీ కృషి చేసి ఉండాల్సిందని చెప్పాడు. ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే.
ధర్మశాల టెస్టు: ఆసీస్ 137 ఆలౌట్, టీమిండియా లక్ష్యం 106
గాయం కారణంగా ధర్మశాల టెస్టులో కోహ్లీ ఆడటం లేదని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పష్టం చేశారు. 2011 నవంబర్ నుంచి 54 టెస్టుల తర్వాత కోహ్లీ లేకుండా టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. దీంతో జట్టు బాధ్యతలను రహానేకి అప్పగించారు.
భారత టెస్టు జట్టు తరపున కెప్టెన్సీ చేపట్టిన 33వ టెస్ట్ ప్లేయర్గా రహానే నిలిచాడు. కెప్టెన్ వేసుకునే బ్లేజర్ దుస్తుల్లో రహానే టాస్ వేసేందుకు స్టేడియంలోకి వచ్చాడు. భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. కోహ్లీ స్ధానంలో కుల్దీప్ యాదవ్ను తీసుకున్నారు.