ముంబై: 2014 చివర్లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్కు మహేంద్ర సింగ్ ధోని వీడ్కోలు పలికిన నాటి నుంచి మిగత ఫార్మెట్లకు కూడా వీడ్కోలు పలుకుతారనే చర్చ జరుగుతోంది. జనవరిలో జరగనున్న ఆసీస్ పర్యనట తర్వాత వన్డేలు, ట్వంటీ20ల నుంచి కూడా తప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదే విషయాన్ని మంగళవారం ఆసీస్ పర్యటనకు బయల్దేరే ముందు ముంబైలో ధోని దగ్గర ప్రస్తావిస్తే తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని ధోని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేనెప్పుడూ వర్తమానంలోనే బతుకుతానని, ప్రస్తుతం తన దృష్టంతా ఆసీస్ పర్యటన, ఆపై వచ్చే టీ20 వర్లడ్ కప్ పైనేనని తెలిపాడు.
అయితే సమయమొచ్చినప్పుడు రిటైర్మెంట్ గురించి సరైన సమయంలో ఆలోచిస్తానని ధోని పేర్కొన్నాడు. ఇక స్పిన్నర్ అశ్విన్ గొప్ప ఫామ్లో కొనసాగుతుండటంపై ధోని సంతోషం వ్యక్తం చేశాడు. అశ్విన్ మంచి ఆలోచన ఉన్న క్రికెటర్, మధ్యలో కొంచెం ఇబ్బందికి గురవ్వడం వల్లనే ఫామ్ కోల్పోయాడని చెప్పుకొచ్చాడు.
అందుకే విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. అయితే మళ్లీ అతను పుంజుకోవడం సంతోషంగా ఉందన్నాడు. జట్టుకు అతనో పెద్ద ఆస్తి. అశ్విన్ను బౌలర్గా అన్ని రకాలుగా ఉపయోగించుకున్నాను. ఫాస్ట్బౌలర్లు ప్రభావం చూపనపుడు అతను నా పనిని తేలిక చేస్తాడని పేర్కొన్నాడు.