హైదరాబాద్: పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో పాకిస్థాన్ కైవసం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టెస్టులో పాకిస్థాన్ 101 పరుగుల తేడాతో వెస్టిండిస్పై ఘన విజయం సాధించింది.
మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో మొదటి రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్ గెలిచి ఇరు జట్లు సమంగా నిలిచాయి. దీంతో మూడో టెస్టు నిర్ణయాత్మకంగా మారింది. మూడో టెస్టులో పాకిస్థాన్ విజయం సాధించడంతో వెస్టిండిస్పై ఆ దేశంలో తొలి టెస్టు సిరిస్ను పాక్ గెలుచుకుంది.
దీంతో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన పాక్ కెప్టెన్ మిస్బా ఉల్ హాక్, వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్కు ఘనమైన వీడ్కోలు పలికినట్లైంది. ఈ సిరిస్లో రాణించిన పాక్ ఆటగాడు యాసిర్ షాకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
విండిస్పై పాక్ సిరిస్ గెలిచిన అనంతరం సహచర ఆటగాళ్లు వీళ్లిద్దరినీ తమ భుజాలపై కూర్చోబెట్టుకుని మైదానంలో కలియ తిరిగారు. 'ఇంతకన్నా మంచి ముగింపు దొరుకుతుందని నేను అనుకోను' అని మ్యాచ్ అనంతరం మిస్బా పేర్కొన్నాడు. పాక్ తరుపున 75 టెస్టులాడిన మిస్బా ఉల్ హక్ 132 ఇన్నింగ్స్ల ద్వారా 5,222 పరుగులు సాధించాడు.