మొహాలి: ఆదివారం నాడు భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో అద్భుతమైన పోరాట పటిమను కనబర్చిన విరాట్ కోహ్లీపై కెప్టెన్ ధోని ప్రశంసలు కురిపించాడు. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో 51 బంతుల్లో 82 పరుగులు సాధించి ఒంటి చేత్తో టీమిండియాను సెమీస్కు చేర్చడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
మిచెల్ జాన్సన్ ట్విస్ట్: కోహ్లీపై మొన్న అలా.. ఇప్పుడిలా!
మ్యాచ్ అనంతరం ధోని మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ ఇన్నింగ్స్పై ప్రశంసలు కురిపించాడు. గత రెండు మూడేళ్ల నుంచి కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడని చెప్పాడు. ప్రస్తుతం కోహ్లీ పరుగుల దాహంతో ఉన్నాడని పేర్కొన్నాడు. కోహ్లీ కెరీర్లోనే ఇదొక అద్భుత ఇన్నింగ్స్గా అభివర్ణించాడు.
ఆసీస్ బౌలర్లు సంధిస్తోన్న డెలివరీలను ఫోర్లుగా మలచడంలో కోహ్లీ విజయం సాధించాడని అన్నాడు. క్రీజులోకి యువరాజ్ సింగ్ రాగానే, ఫోరో కొట్టినా తర్వాత బంతికే ఎడమ కాలి గాయంతో బాధపడినప్పటికీ, వీరిద్దరి భాగస్వామం భారత్ జట్టుకు కలిసొచ్చిందని చెప్పుకొచ్చాడు.
బ్యాటింగ్లో యవరాజ్ విశ్వాసంగానే కనిపించినా, క్రీజులు చురుగ్గా పరుగెత్తలేకపోవడం జట్టుపై కాస్తంత ఒత్తిడిని పెంచిందని అన్నాడు. ఆ తర్వాత యువీ ఔటవ్వడంతో ధోని బ్యాటింగ్కు వచ్చాడు. డబుల్స్ తీయాల్సిన చోట... సింగిల్స్ రావడంతో భారత్ జట్టు మరింత ఒత్తిడికి గురైందని చెప్పాడు.
విరాట్ షో, సాటిలేరెవ్వరూ: కోహ్లీపై ఆసీస్ మీడియా
కోహ్లి చాలా సందర్భాల్లో రిస్క్ చేసి మరీ రెండు పరుగులు తీశాడు. ఇదే భారత జట్టును విజయం దిశగా నడిపించింది. నిజానికి ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తేవాళ్లే. ఇలా వేగంగా పరుగులు తీయడంపై ధోనీ స్పందిస్తూ.. కోహ్లి లాంటి ఫాస్ట్ రన్నర్ ఉండటం జట్టుకు బాగా కలిసొచ్చే అంశమని పేర్కొన్నాడు.
'అతడు నాకు ఇప్పటికీ డబ్బు కట్టాల్సి ఉంది. అతని పరుగుల కోసం నేను పరిగెత్తాను' అంటూ సరదాగా ధోని వ్యాఖ్యానించాడు. 'మిడిల్ ఓవర్లలో నువ్వు మంచి రన్నర్వి అయితే.. మీపై ఒత్తిడి తగ్గి, బౌలర్లు, ఫీల్డర్లపై ఒత్తిడి పడుతుంది. నిజానికి నేనేం గ్రేట్ బ్యాట్స్మన్ను కాను. సంప్రదాయబద్ధమైన క్రికెట్ను ఆడుతాను. కొడితే రెండు పరుగులు తీయడం లేదా సిక్స్ బాదడం అంతే నేను చేసేది. విరాట్ లాగా ఎటుపక్కకైనా షాట్లు నేను కొట్టలేను' అని ధోనీ అన్నాడు.
ఈ సమయంలో ధోని, కోహ్లీలు వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తుతూ అదను చిక్కనప్పుడల్లా డబుల్స్ తీయడం మొదలుపెట్టారు. ఇలా 31 బంతుల్లో ధోని, కోహ్లీలు 67 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. దేశం, జట్టు కోసం తనని తాను నిరూపించుకునేందుకు ఇదే చక్కని అవకాశమని కొనియాడాడు.
నిజానికి జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు కామ్గా ఉంటే సరైన నిర్ణయం తీసుకోగలవని మైదానంలో కోహ్లీకి ధోని చెప్పినట్టు పేర్కొన్నాడు. కామ్గా ఉండటం మంచిదైనప్పటికీ, సవాళ్లను ఎదుర్కొనడంలో విరాట్ కోహ్లీ ఎల్లప్పుడూ ముందుంటాడని మెచ్చుకున్నాడు.
ఓ ఆటగాడిగా సరైన మార్గంలో వెళ్తున్నప్పటికీ, తన దూకుడు స్వభావాన్ని కోహ్లీ ఎప్పుడూ వదులుకోలేదని అన్నాడు. అదే కోహ్లీ బలం అని చెప్తూ, ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ పోరాట పటిమ ఎంతగానో ఆకట్టుకుందని కొనియాడారు. కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని, ఫిట్గా ఉన్నాడని, ఎక్కడైనా ఫీల్డింగ్ కూడా చేయగలడని ధోనీ కొనియాడాడు.
మరోవైపు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంటూ విరాట్ కోహ్లీ తన టాప్ 3 ఇన్నింగ్స్ల్లో ఇదొకటిగా పేర్కొన్నారు. ఈ మ్యాచ్లో కాస్త భావోద్వేగంతో ఉన్నానని చెప్పుకొచ్చాడు. అందుకే ఇదే అత్యుత్తమమని కూడా అనిపిస్తోందని కోహ్లీ అన్నాడు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు అభిమానుల మద్దతు అండగా నిలిచిందని అన్నాడు. ప్రతి మ్యాచ్లోనూ సవాళ్లు ఉంటాయని చెప్పిన కోహ్లీ ఓ క్రికెటర్గా ఎదగడానికి ఇదే మార్గమని అన్నాడు.
యువీతో మంచి భాగస్వామ్యం లభించిందిని అన్నాడు. నేను మరీ తొందరపడి అడేవాడినని, ధోని నన్ను ప్రశాంతంగా ఉంచాడని అన్నాడు. వికెట్ల మధ్య పరిగెత్తడంలో మా ఇద్దరికీ మంచి అవగాహన ఉందని చెప్పుకొచ్చాడు. కఠినమైన వ్యాయామాలుస ఫిట్ నెస్ కసరత్తులు చేసేది ఇందుకోసమేనని అన్నాడు.