హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్పై గృహహింస కేసు నమోదైనట్లు వచ్చిన వార్తలను యువీ తరుపు న్యాయవాది దమన్ బిర్ సింగ్ సోబ్తి ఖండించారు. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆయన పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే...
క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబ సభ్యులపై అతడి మరదలు ఆకాంక్ష శర్మ గృహహింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. యువరాజ్ తమ్ముడు జొరావర్ సింగ్ భార్య అయిన ఆకాంక్ష తన భర్తతో పాటు అత్త షబ్నమ్ సింగ్పైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో యువీపై కూడా కేసు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ యువరాజ్పై ఆకాంక్ష ఎలాంటి కేసు పెట్టలేదని తాజాగా స్పష్టం చేశారు. 'యువీపై క్రిమినల్ కేసు నమోదైందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఆ వార్తల్లో వాస్తవం లేదు. యువీపై ఎలాంటి కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ నమోదు కాలేదు' అని ఆయన తెలిపారు.
జోరావర్, ఆకాంక్షలు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ గతంలోనే కోర్టును ఆశ్రయించారని, అలాంటప్పుడు మళ్లీ గృహహింస కేసు వార్తలు రావడం వెనుక ఎవరో కావాలని చేశారని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే చాలా రోజులుగా జొరోవర్, ఆకాంక్ష విడిగానే ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే విషయంపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. మరోవైపు ఆకాంక్ష వద్ద ఉన్న నగలను తిరిగి ఇచ్చేయాలని ఇటీవలే యువీ తల్లి షబ్నం సింగ్ కూడా కేసు వేసింది. కుమారుడు తమకే కావాలంటూ జోరోవర్, షబ్నంలు ఆకాంక్షపై ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలిసింది.
ఇదే విషయమై సోదరుడుతో పాటు అమ్మకు యువీ వత్తాసు పలుకుతున్నాడనే దానిపై యువరాజ్పై గృహహింస కేసు నమోదైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యువీ కుటుంబీకులపై ఆకాంక్ష గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యువీ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు.