హైదరాబాద్: భారత జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బీసీసీఐతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. 2011 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ ఈ ఏడాది వెస్టిండిస్ పర్యటన అనంతరం జట్టులో స్థానం కోల్పోయాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరిస్లో యో-యో టెస్టులో విఫలం కావడంతో యువీ చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో ఈ ఏడాది జూలై నుంచి భారత్ తరుపున ఆడే అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా బీసీసీఐ నుంచి తనకు రావాల్సిన రూ.3 కోట్ల విలువైన ఐపీఎల్ బకాయిలను రాబట్టుకోవడం కోసం యువీ బోర్డును పదే పదే కోరినప్పటికీ స్పందన లేదు. గతేడాది జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20లో యువరాజ్ గాయపడిన సంగతి తెలిసిందే.
గాయం కారణంగా ఆ సీజన్లో సన్రైజర్స్ తరఫున తొలి ఏడు మ్యాచ్ల్లో బరిలో దిగే అవకాశాన్ని యువరాజ్ కోల్పోయాడు. బీసీసీఐ పాలసీ ప్రకారం ఐపీఎల్లో ఆడుతున్న భారత ఆటగాళ్లకు బోర్డే బీమా చేసింది. ఈ పాలసీ ప్రకారం ఫ్రాంచైజీ తరఫున ఏ ఆటగాడైనా ఆడలేకపోయినా, టీమిండియా తరఫున ఆడుతూ గాయపడి మ్యాచ్లకు దూరమైనా.. ఆటగాడికి వాటిల్లే నష్టాన్ని బీసీసీఐ భరిస్తుంది.
ఈ క్రమంలో బీసీసీఐ నుంచి తనకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరుతూ యువరాజ్ గత ఏడాదిన్నరగా పోరాడుతున్నాడు. ఈ విషయమై యువరాజ్ అనేకసార్లు బీసీసీఐ అధికారులకు లేఖలు కూడా రాసినప్పటికీ ఫలితం లేకపోయింది.
అంతేకాదు యువరాజ్ తరుపున అతడి తల్లి షబ్నం సింగ్ కూడా పలుమార్లు బోర్డు అధికారులకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే గతేడాది ఐదు మ్యాచ్లకు దూరమైన నెహ్రాకు మాత్రం బీసీసీఐ బకాయిలు చెల్లించింది.
అయితే యువరాజ్ విషయంలో బోర్డు సభ్యులు ఎందుకిలా వ్యవహారిస్తున్నారో అర్ధం కావడం లేదని అంటున్నారు. కాగా, యువరాజ్కి బకాయిలు చెల్లింపు విషయంలో అధికారులు అలసత్వం వహించలేదని, ఇన్స్యూరెన్స్ పత్రాలు సరైన క్రమంలో లేకపోవడం వల్లనే ఇబ్బంది తలెత్తిందని అధికారులు చెబుతున్నారు.