హైదరాబాద్: తన కథను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. క్యాన్సర్ను జయించి అనంతరం క్రికెట్లోకి అడుగుపెట్టి తనదైన శైలిలో క్రికెట్ అభిమానులను అలరిస్తున్నానని అలాంటి తన కథ యువతకు ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని చెప్పాడు.
యువరాజ్ సింగ్ యువ్ వి కెన్ (వైడబ్ల్యూసీ) పేరిట ఓ ఫ్యాషన్ బ్రాండ్ను నిర్వహిస్తున్నాడు. ఈ ఫ్యాషన్ బ్రాండ్కి సంబంధించి దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో స్టోర్లను ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. తన మొట్టమొదటి స్టోర్ని వారణాసిలో ప్రారంభించాడు. ఈ స్టోర్ కు విశేషాలను యువరాజ్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.
ఈ సందర్భంగా యువరాజ్ మీడియాతో మాట్లాడాడు. 'నా మొదటి ప్రాధాన్యత క్రికెట్కే. ఇప్పడు నాకు పెళ్లి అయింది. కాబట్టి భార్య కూడా ప్రధానమైనదే. ఆ తర్వాత నా బ్రాండ్. జీవితంలో ప్రతి దానికీ ఎంతో కొంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. క్రికెట్ కెరీర్, వ్యక్తిగత జీవితం, సంస్థ బాధ్యతలు నిర్వహించడం కొంచెం కష్టంగా ఉంది' అని యువీ అన్నాడు.
తద్వారా ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోందని యువరాజ్ చెప్పుకొచ్చాడు. జీవితంలో పరిణితి సాధిస్తే వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం తెలుస్తుందని అన్నాడు. న్యూస్ పేపర్లు చదవనని, మీడియాలో వచ్చే గాసిప్స్కి దూరంగా ఉండటం వల్లే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాని యువీ అన్నాడు.