హైదరాబాద్: కెరీర్ పరంగా ఈ ఏడాది సాధించిన విజయాలతో తాను సంతృప్తిగా ఉన్నానని, వచ్చే సీజన్లోనూ ఇదే జోరుని కొనసాగిస్తానని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెప్పింది. ఇక 2017లో కెరీర్ స్లామ్ పూర్తిచేయడంపై దృష్టి సారించినట్లు తెలిపింది.
ఇప్పటికే డబుల్స్, మిక్స్డ్ విభాగాల్లో మూడు గ్రాండ్స్లామ్లు అందుకున్న సానియా మిర్జా డబుల్స్లో ఫ్రెంచ్ ఓపెన్, మిక్స్డ్లో వింబుల్డన్ నెగ్గితే నాలుగు గ్రాండ్స్లామ్స్తో కెరీర్ స్లామ్ పూర్తి చేసిన ఘనతను అందుకుంటుంది. వచ్చే ఏడాది చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బరా స్ట్రికోవాతో తన భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపింది.
'ఈ ఏడాది ఎన్నో అద్భుత విజయాలను అందుకున్నా. ఎనిమిది టోర్నీలు, ఓ గ్రాండ్స్లామ్ గెలిచా. డబుల్స్ విభాగంలో నెంబర్ వన్గా ముగిస్తున్నా. ఇంతకు మించి ఈ ఏడాది ఏమి కోరుకోవడం లేదు. ఈ ఏడాది నెంబర్ వన్ స్దానంతో ముగించడం ఎంతో సంతోషంగా ఉంది' అని సానియా తెలిపింది.
'వచ్చే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి మహిళల డబుల్స్లో కెరీర్స్లామ్ పూర్తి చేయాలనుకుంటున్నా. మిక్స్డ్లో వింబుల్డన్ కూడా సాధించాల్సి ఉంది. అదే గనుక జరిగితే అద్భుతంగా ఉంటుంది. సాధ్యం కాకపోయినా చంపుకోను. గత మూడు సంవత్సరాలను చూస్తే ఏదో స్లామ్ సాధించాను' అని తెలిపింది.
ఇక డబుల్స్లో భాగస్వామిని మారుస్తారా? అన్న ప్రశ్నకు గాను సానియా లేదని సమాధానమిచ్చింది. 'గతేడాది ఇద్దరం కలిసి ఆరు టోర్నమెంట్లు ఆడాం. అందులో రెండు గెలువగా ఒక ఫైనల్ ఆడాం. ఆమె ఓ గ్రేట్ ఫైటర్. టెన్నిస్ ప్లేయర్గా అదే ఆమె గొప్పతనం. స్ట్రికోవాతో మంచి విజయాలు అందుకుంటున్నా'' అని సానియా చెప్పింది.
ఇక స్విస్ దిగ్గజం మార్టినా హింగిస్తో తన ప్రయాణం గొప్పగా సాగిందని ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నానని సానియా పేర్కొంది. గత 14ఏళ్లుగా తామిద్దరం ఒకరికి ఒకరం తెలుసుని సానియా వెల్లడించింది. మిక్స్డ్ డబుల్స్లో క్రొయేషియా ఆటగాడు డోడిగ్తో కలిసి ఆడతానని.. ఒకవేళ అతడు గాయాల నుంచి కోలుకోకుంటే వేరే ఆటగాడితో జోడీ కట్టొచ్చని ఆమె చెప్పింది.