మెల్బోర్న్: తొలి ట్వంటీ20 మ్యాచులో తమ ఓటమికి కారణమైన భారత ఆటగాడు విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా ఆటగాళ్లు టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. కోహ్లీ ఉద్వేగాన్ని ఒకరి తర్వాత ఒకరు తప్పు పడుతున్నారు. తాజాగా, షేన్ వాట్సన్ కోహ్లీ ఉద్వేగంపై వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ కోహ్లీకి, స్టీవ్ స్మిత్కు మధ్య భారీ, ఆరోగ్యకరమైన పోటీ ఉందని షేన్ వాట్సన్ అన్నాడు. అయితే, స్టీవ్ స్మిత్ అవుటైన తర్వాత కోహ్లీ ప్రతిస్పందించిన తీరును ఎక్కువ చేసి చూపడానికి ఆయన ఇష్టపడలేదు.
పోటీలో ఉండడానికి విరాట్ కోహ్లీ ఎక్కువగా ఉద్వేగానికి గురవుతాడని ఆయన అన్నాడు. స్టీవ్ స్మిత్కు, విరాట్ కోహ్లీకి మధ్య పెద్ద ఆరోగ్యకరమైన పోటీ ఉందని, ప్రస్తుతం ఇరువురు కూడా ప్రపంచంలోనని అత్యంత ప్రతిభావంతమైన బ్యాట్స్మెన్ అని ఆయన గురువారంనాడు అన్నాడు.
స్మిత్ విరాట్ కోహ్లీ వల్ల ఇబ్బంది పడ్డాడని అనుకోవడం లేదని, విరాట్ కోహ్లీ ఆటను హృదయానికి తీసుకుంటాడని, దానివల్ల కొన్ని సార్లు చిక్కుల్లో పడుతాడని, అదే అతన్ని ముందుకు నడిపిస్తోందని అన్నాడు.