హైదరాబాద్: ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ ప్రీక్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు ప్రదర్శనపై బ్రెజిల్ కోచ్ కార్లోస్ అమెడ్యూ అసహనం వ్యక్తం చేశాడు. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో హోండ్యూరాస్పై 3-0 తో గెలిచినప్పటికీ బ్రెజిల్ జట్టు ప్రదర్శనతో ఆయన సంతృప్తి చెందకపోవడం విశేషం.
క్వార్టర్ ఫైనల్లో బలమైన జర్మనీ జట్టుతో తలపడబోతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడాడు. 'అందరి ఆటగాళ్లు వారి బాధ్యతపై అవగాహన కలిగి ఉన్నారు. వారు సమష్టగా రాణిస్తున్నారు. మా డిఫెన్సివ్ వ్యవస్థలో మిడ్ఫీల్డ్ విభాగం సరిగా లేదు. అయినప్పటికీ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చాం. వారు (హోండ్యూరాస్) మాతో సమానంగా స్కోర్ చేసేందుకు ప్రయత్నించారు' అని అన్నాడు.
ఈ నేపథ్యంలో మా తదుపరి మ్యాచ్లో తమ జట్టు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కార్లోస్ చెప్పాడు. హోండ్యూరాస్తో జరిగిన మ్యాచ్లో 20 నిమిషాల పాటు ఆట రసవత్తరంగా సాగిందని, ఆ తర్వాతి వాళ్లను అడ్డుకోవడంలో తమ జట్టు వెనుకబడిందని కార్లోస్ చెప్పాడు.
ప్రథమార్థం చివర్లో మేము రెండో గోల్ చేయడం తమకు కొంతమేర ఉపశమనం కలిగించిందని వివరించాడు. హోండ్యూరాస్తో మ్యాచ్ చివర్లో తమ ఆటగాళ్ల ప్రదర్శనను కొంత మెచ్చినట్లు కోచ్ అంగీకరించాడు. కానీ జర్మనీతో మ్యాచ్లో ఇలాంటి ప్రదర్శన సహించేది లేదని హెచ్చరించాడు.
'ఇలాంటి క్షణాల్లో మేము ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది. ఇది మాకు చాలా సవాల్తో కూడుకున్నది.. తనతో పాటు మా జట్టు సాంకేతిక సిబ్బంది దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది' అని కార్లోస్ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు టోర్నమెంట్లో తమ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు కోచ్ వెల్లడించాడు.
'మా ఆటగాళ్లను చూసి గర్వపడుతున్నాను. వాళ్లెంతో పరిపక్వతతో ఆడుతున్నారు. 2015 నుంచి ఈ యువ జట్టుతో కలిసి పని చేస్తున్నాం. అందుచేతనే మేమింత గొప్ప ప్రదర్శన చేస్తున్నాం' అని ఆనందం వ్యక్తం చేశాడు.