కోల్కతా: వచ్చే ఏడాది భారత్లో అంతర్జాతీయ క్రీడా సంరంభం నిర్వహణకు అంతా సిద్ధమవుతున్నది. 2017 అక్టోబర్ ఆరో తేదీ నుంచి 28వ తేదీ వరకు అండర్ - 17 ఫుట్బాల్ వరల్డ్కప్ జరుగనున్నదని ఫిఫా ప్రకటించింది. మ్యాచ్ల నిర్వహణకు కోల్ కతాలోని మైదానాన్ని ఆమోదించిన తర్వాత ఫిఫా యు-17 ప్రాజెక్ట్ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య మీడియాకు తెలిపారు. దేశంలోని ఆరు స్టేడియంలలో మ్యాచ్ల నిర్వహణకు జూలై ఏడో తేదీన డ్రా తీయనున్నారు.
'మేం రెండేండ్ల క్రితం స్టేడియంను చూశాం. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్టేడియం ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ స్టేడియం 30 ఏళ్లలోపు కుర్రాళ్లు ఆడే వేదికగా మారిందని నేను విశ్వసిస్తున్నాను. నేను ఇక్కడే ఫుట్ బాల్ ఆడుతూ పెరిగాను. అంతర్జాతీయ మ్యాచ్లు జరిగేందుకు కోల్ కతా స్టేడియంను ఆరో వేదికగా ఆమోదిస్తున్నాం' అని తెలిపారు.
'స్టేడియం ఆధునీకరణకు చాలా పనులు జరిగాయి. గత ఫిబ్రవరిలో స్టేడియంను తనిఖీచేసిన తర్వాత స్ఫూర్తిదాయకమైన పురోగతి సాధించారు. చాలా పని జరిగినందువల్లే ఈ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణకు అనువైనదని ధ్రువీకరిస్తున్నాం. ఈ స్టేడియం భారత్ తోపాటు అంతర్జాతీయంగానూ పోటీ పడగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంది' అని ఫిఫా కాంపిటీషన్ విభాగం ప్రతినిధి బ్రుందం చీఫ్ మారియన్ మేయర్ వొర్ ఫెల్డర్ చెప్పారు.
పశ్చిమ బెంగాల్ క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ మాట్లాడుతూ ప్రస్తుతం 75 - 80 శాతం పనులు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి ఆధునీకరణ పూర్తవుతుందన్నారు. పనులన్నీ పూర్తయిన తర్వాత పూర్తిగా తాము సంత్రుప్తి చెందాకే ఫైనల్స్ మ్యాచ్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని టోర్నమెంట్ డైరెక్టర్ జావియర్ కెప్పి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
వేసవికంటే వర్షాకాలంలో తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయని, జనవరిలో వాతావరణ పరిస్థితులను తాము అర్థంచేసుకుని, పూర్తి పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎక్కడ ఫైనల్స్ మ్యాచ్ నిర్వహించాలి, కీలక మ్యాచ్లు నిర్వహించాలన్న విషయమై ఓ నిర్ణయానికి వస్తామన్నారు.
భద్రతా ఏర్పాట్లపైనా హ్యాపీగా ఉన్నట్లు జావియర్ కెప్పి తెలిపారు. తానిప్పటివరకు 30 సార్లు బెంగాల్ కు వచ్చానని, ఏనాడు ముప్పు ఎదురు కాలేదని, తనకు ఘన స్వాగతం పలికే వారని చెప్పారు. మ్యాచ్లకు భద్రతపై రాష్ట్రప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ చాలా మంచి టోర్నమెంట్ నిర్వహణకు ప్రయత్నిస్తామని కెప్పి అన్నారు.
మ్యాచ్ ల నిర్వహణకు తమ ధ్రువీకరణ బ్లాంక్ చెక్ మాత్రం కాదని, ఎప్పటికప్పుడు ఆధునీకరణ పనులను నిర్దేశిత గడువు ప్రకారం తనిఖీచేస్తూనే ఉంటామన్నారు. కోచి, ముంబై, గౌహతి, ఢిల్లీ, మార్గోవాలను ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ ల నిర్వహణకు తనిఖీ కమిటీ ఆమోదించింది.
ముంబై సిటీలో బ్రెజిలియన్ స్ట్రయికర్ థియాగో
ముంబై: గాయపడిన గాస్టోన్ సంగోయ్ స్థానే ముంబై సిటీ ఎఫ్ సి జట్టులో బ్రెజిలియన్ స్ట్రయికర్ థియాగో కున్హా చేరాడు. ఈ మేరకు జట్టు యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సంగోయ్ కుడి కాలుకు గాయం కావడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. సెరియా ఎ, ఎఎఫ్ సి చాంపియన్స్ లీగ్ తదితర టాప్ టోర్నమెంట్లలో కీలకమైన ప్లేయర్ అయిన థియాగో రాక 'చాలా మంచి భర్తీ' అని ముంబై హెడ్ కోచ్ అలెగ్జాండ్రీ గుమారెస్ వ్యాఖ్యానించాడు.
గాయంతో గాస్టోన్ ను కోల్పోవడం తమకు తీరని లోటని, ఆయనకు బదులుగా గోల్స్ సాధనలో తెలివిగా వ్యవహరించే థియాగో రాకతో తమ జట్టుకు గొప్ప ఆస్తిగా భావిస్తున్నామన్నాడు. థియాగో ఆధ్వర్యంలో 2010 బ్రెజిలియన్ పరాయిబాను స్టేట్ చాంపియన్ షిప్, 2011లో బ్రెజిలియన్ పెరా్నంబుకానో స్టేట్ చాంపియన్ షిప్లను గెలుచుకున్నాడు.