హైదరాబాద్: పుట్ బాల్ మ్యాచ్లో విషాదం చోటు చేసుకుంది. అర్జెంటీనాలో ఓ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఇరు జట్ల అభిమానుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ అభిమాని తీవ్రంగా గాయపడి మరణించాడు.
శనివారం బెల్గ్రానో, టాలెరెస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో స్టేడియంలో మ్యాచ్ తిలకిస్తున్న ఇరు జట్ల అభిమానులు పరస్పరం దాడికి దిగారు. ఈ దాడిలో టాలెరెస్ అభిమానుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో బెల్గ్రానో అభిమాని ఎమాన్యుల్ బాల్బో తీవ్రంగా గాయపడ్డాడు.
టాలెరెస్ అభిమానుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో అతని తల స్టేడియంలోని కాంక్రీట్ గోడను తాకింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని స్టేడియంలోని టీవీ కెమెరాలు బంధించాయి. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా, కోమాలో ఉన్నట్టు వైద్యులు చెప్పారు.
ఆ తర్వాత అతని బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. ఎమాన్యుల్ బాల్బో మృతిపై ఫుట్బాల్ సంఘాల అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, అభిమానులు ఇలా దాడులకు దిగడం సరికాదని పేర్కొన్నారు.