న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 3 ఎడిషన్లో తొలిసారి ఢిల్లీ డైనమోస్ తన సొంత గడ్డపై నార్త్ఈస్ట్ యునైటెడ్ క్లబ్తో శనివారం తలపడనుంది. రెండు జట్లూ ప్రస్తుత సీజన్లో చాంపియన్ షిప్ టైటిల్ కోసం ఎక్సలెంట్ స్టార్లుగా పోటీపడుతున్నవే. ప్రస్తుత సీజన్లో నార్త్ ఈస్ట్ క్లబ్ ఇంప్రెసివ్గా ఆడుతూ ముందుకు దూసుకెళుతున్నది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమ్మత్తేమిటంటే రెండు జట్లూ కూడా కీలక ప్లేయర్లు లేకుండానే తలపడుతుండటం గమనార్హం. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్సి జట్టును 3-0 స్కోర్ తేడాతో మట్టి కరిపించిన ఢిల్లీ కుర్రాళ్లు.. కేరళ బ్లాక్ బస్టర్స్తో జరిగిన మ్యాచ్ ను డ్రాగా ముగించి.. నాలుగు పాయింట్లు పొందారు.
మరోవైపు నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి జట్టు నాలుగింట మూడు మ్యాచ్ లలో విజయ డంకా మోగించి తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంతకుముందు జరిగిన రెండు ఎడిషన్లలో నాలుగు మ్యాచ్ లలో ఢిల్లీ డైనమోస్ రెండింటిని మాత్రం డ్రాగా ముగించి, మరో రెండింటిలో విజయం సాధించింది.
ఇప్పటికే కఠినతరమైన ప్రాక్టీస్ తో ప్రత్యర్థులకు గట్టిపోటీనిస్తున్న ఢిల్లీ డైనమోస్ ను ఎదుర్కోవడం అంత తేలికేం కాదు. అలాగని వింగాడ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన నార్త్ఈస్ట్ జట్టు కూడా ప్రత్యర్థులకు కొరుకుడు పడేదేం కాదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ డైనమోస్ హెడ్ కోచ్ గియాంలుక జంబ్రొట్టా మాట్లాడుతూ 'మేం ప్రస్తుత సీజన్ లో సొంత గడ్డపై మ్యాచ్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
గతంలోనూ నార్త్ఈస్ట్ తో జరిగిన మ్యాచ్ లు కొంత ఆసక్తిని రేకెత్తించాయి. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో స్థానిక అభిమానుల దన్ను మాకు ఉపకరిస్తుంది. మా కుర్రాళ్లు మంచి గేమ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఫుట్ బాల్ మ్యాచ్ లు చాలా కష్టంగా ఉంటాయి' తెలిపాడు.
గతంలో నార్త్ఈస్ట్కు ఢిల్లీ వాసుల మద్దతు లభించిన నేపథ్యంలో ఆ జట్టుతో జరిగే మ్యాచ్ ను వీక్షించేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావాలని అభిమానులను జంబ్రొట్టా కోరాడు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్ను కనీసం డ్రాగానైనా ముగించేందుకు వీలవుతుందని సూచించాడు.
వాళ్లను కూడా మ్యాచ్ను వీక్షించేందుకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నానని చెప్పాడు. తమకు ఫ్యాన్స్ మద్దతు అవసరమని అభిప్రాయ పడ్డాడు. కేరళలో 60 వేల మంది ఫ్యాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లోనూ తాము భయపడలేదన్నాడు. చెన్నైయిన్తో మ్యాచ్ పూర్తయిన వెంటనే కేరళతో తలపడాల్సి రావడంతో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపాడు.
అయితే నార్త్ఈస్ట్తో జరిగే మ్యాచ్ లో మెరుగైన ఆటతీరుకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నాడు. ఆటగాళ్లు డిఫెన్స్కు ప్రాధాన్యం ఇస్తే ఫలితం మెరుగ్గా ఉంటుందని వ్యాఖ్యానించాడు. నార్త్ ఈస్ట్ కోచ్ నెలో వింగాడ సైతం తాము కోలుకోవడంపైనే ద్రుష్టిని కేంద్రీకరిస్తామని పేర్కొనడం గమనార్హం.
గత మ్యాచ్ను ఒక గంట సేపు 10 మంది ఆటగాళ్లతోనే గెలుచుకున్నామని గుర్తు చేశాడు. లీగ్ టోర్నీలో పాల్గొనే జట్లన్నీమెరుగైన ఆటతీరు ప్రదర్శించడం సీజన్ ప్రారంభం నుంచి తాము గమనిస్తున్నామని తెలిపాడు. తాము నాలుగు గేమ్స్ ఆడామని, వాటిల్లో సాకులు వెతకడం లేదన్నాడు. తాము మంచి ప్రత్యర్థి జట్టుతోనే వారి సొంత గడ్డపైనే ఆడుతున్నామని అన్నాడు.
ఢిల్లీలో సమర్థులైన ఆటగాళ్లు ఉన్నారని, వారు డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ను ఓడించి, కేరళతో మ్యాచ్ డ్రా చేసుకున్నారని వింగాడ గుర్తుచేశాడు. ఢిల్లీలో అనుభవం గల ఆటగాళ్లు ఉన్నారని, రెండు వారాల్లో తాము ఐదో మ్యాచ్ ఆడుతున్నామని ప్రొఫెసర్ గా పేరొందిన వింగాడ వ్యాఖ్యానించాడు.
ఢిల్లీ సొంతగడ్డపై మ్యాచ్ చీఫ్ కోచ్ జంబ్రొట్టాకు తొలి అనుభవమే. చెన్నైయిన్తో జరిగిన మ్యాచ్లో బ్రెజిలియన్ స్టార్ ఆటగాడు మార్సెల్లో పెరీరాను కేరళతో జరిగిన మ్యాచ్లో ఆడటం లేదు. నార్త్ఈస్ట్తో జరుగుతున్న మ్యాచ్లో పెరీరా తన జూలు విదిలుస్తాడా? లేదా? అన్న సంగతి వేచిచూడాల్సిందే. డిఫెన్సివ్ వ్యూహంతోనే నార్త్ఈస్ట్ పై తల పడతామని జంబ్రొట్టా వ్యాఖ్యానించాడు.
కేరళతో జరిగిన మ్యాచ్లో గాయపడిన గోల్ కీపర్ ఆంటోనియో డోబ్లాస్ స్థానే మణిపురి సోరం పౌరెన్ను తీసుకున్నారు. గాయంతో బాధపడుతున్న సెంట్రల్ డిఫెండర్ అనాస్ ఈడాథోడికా ఆడేది ఆడనిది వైద్యులు నిర్ణయిస్తారని తెలుస్తున్నది. ఇక ఢిల్లీ కెప్లెన్ ఫ్లోరెంట్ మాలౌడా గత మ్యాచ్ లో స్టార్టింగ్ లైనప్ వద్ద బ్యాక్ సైడ్ ప్లేయర్ గా వ్యవహరించాడు.