హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్లో అరంగేట్రం చేసిన కొత్త జట్టు గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. శుక్రవారం సొంతగడ్డపై జరిగిన పోరులో గుజరాత్ 39-21తో యూ ముంబాను చిత్తుగా ఓడించింది. ఈ విజయంలో కెప్టెన్ సుఖేష్ హెగ్డే, రోహిత్ గుల్లా, సచిన్లు కీలకపాత్ర పోషించారు.
జోన్-ఎ పోరులో గుజరాత్కిది రెండో విజయం కాగా పటిష్టమైన యు ముంబాకిది రెండో ఓటమి కావడం విశేషం. డిఫెన్స్లో ఘోరంగా విఫలమైన ముంబా ఏ దశలోనూ గుజరాత్కు పోటీ ఇవ్వలేకపోయింది. ఆరంభం నుంచే గుజరాత్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. రెండో నిమిషంలోనే 2-0తో గుజరాత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఆ తర్వాత 6-0తో ఆధిక్యంలో ఉన్న దశలో రైడ్కు వెళ్లిన సచిన్ రెండు పాయింట్లు తీసుకొచ్చాడు. ఆ వెంటనే ముంబై రైడర్ను పట్టేసిన గుజరాత్ ప్రత్యర్థిని ఆరో నిమిషంలోనే ఆలౌట్ చేసి 9-1తో ఆధిక్యంలో నిలిచింది. ముంబా కెప్టెన్ అనూప్ కుమార్ వైఫల్యం కూడా ఫలితంపై ప్రభావం చూపింది.
రోహిత్, సచిన్ రైడింగ్లో రాణించడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి గుజరాత్ 20-6తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇక రెండో అర్ధభాగంలో ముంబా కూడా గట్టిగానే పోరాడినప్పటికీ, అప్పటికే తిరుగులేని ఆధిక్యం సాధించిన గుజరాత్ను ఓడించడం ముంబా ఆటగాళ్లకు సాధ్యం కాలేదు.
రోహిత్ (9), సచిన్ (8), అబోజర్ మిగాని (5) గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. రైడ్ల ద్వారా 19 పాయింట్లు గెలిచిన గుజరాత్ 13 ట్యాకిల్ పాయింట్లు సొంతం చేసుకుంది. ముంబా డిఫెన్స్లో 5 పాయింట్లు సాధించింది. ఈ విజయంతో గుజరాత్ (13) జోన్-ఎలో పుణెరి పల్టన్ (11)ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది.