హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాకు అరుదైన గౌరవం దక్కింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) పాలక మండలి సభ్యురాలిగా ఆమె నియమితురాలయ్యారు. శాయ్ కార్యదర్శి ఎస్ఎస్ ఛాబ్రా నుంచి ఈ మేరకు గుత్తా జ్వాలాకు లేఖ అందింది.
దేశంలో బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుందని శాయ్ కార్యదర్శి ఎస్ఎస్ ఛాబ్రా తెలిపారు. ఈ సందర్భంగా గుత్తా జ్వాలా ఆనందం వ్యక్తం చేశారు. శాయ్ సభ్యురాలిగా తనను నియమించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ నిర్ణయం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, శాయ్ అధికారులు రెండు రోజుల క్రితం తనకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపారని ఆమె వెల్లడించారు. శాయ్లో తన విధులు, బాధ్యతలు ఇంకా తెలియనప్పటికీ, ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో శాయ్తో తన మొదటి సమావేశం ఉంటుందని అన్నారు.
దేశ క్రీడారంగ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. క్రీడారంగానికి ఏదో ఒకటి చేయాలని ఎప్పుడూ అనుకునేదాన్నని ఆమె పేర్కొన్నారు. కాగా, 14 సార్లు జాతీయ ఛాంపియన్ అయిన జ్వాలా ప్రస్తుతం డబుల్స్లో సత్తా చాటుతోంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ పతకం సాధించింది.
దీంతో పాటు 2011 ప్రపంచ ఛాంపియన్ షిప్లో రజతం సాధించింది. గుత్తా జ్వాలా భారత్ తరఫున ఒలింపిక్స్లో రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. వీటితో పాటు 2014 గ్లాస్వో గేమ్స్ మహిళల డబుల్స్ విజేతగా నిలిచింది.