న్యూఢిల్లీ: నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో రెజ్లర్ నర్సింగ్యాదవ్ విఫలం కావడంతో రియో ఒలింపిక్స్ రెజ్లింగ్ అంశంలో భారత ఆశలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అతడి నుంచి తీసుకున్న 'ఏ' నమూనాతో పాటూ 'బి' నమూనాలోనూ నిషేధిత మిథేనడైనన్ అనే ఉత్ప్రేరకాలు ఉన్నట్లు నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తేల్చిచెప్పడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
ఈ నేపథ్యంలో.. తనపై కుట్ర జరిగిందని రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆరోపించాడు. తాను ఎలాంటి నిషేధిత ఉత్ప్రేరకాలను తీసుకోలేదని స్పష్టం చేశాడు. తాను బాగానే పర్ఫార్మ్ చేస్తున్నట్లు చెప్పిన రెజ్లర్ తనకు నిషేధిత ఉత్ర్పేరకాలు వాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. ఆహారంలో కానీ నీటిలో కానీ ఎవరో ఏదైనా కలిపి ఇచ్చి ఉంటారని నర్సింగ్ ఆరోపించాడు.
డోపింగ్ కుట్ర గురించి రెజ్లింగ్ సమాఖ్యకు లేఖ రాసినట్లు నర్సింగ్ తెలిపాడు. తనను రియోకు పంపాలని, సమస్యను వెంటనే పరిష్కరించాలన్నాడు. తనకు న్యాయం చేయాలని సమాఖ్యను కోరినట్లు నర్సింగ్ తెలిపాడు. డోపింగ్ కుట్రపై సీబీఐ విచారణ చేపట్టాలని నర్సింగ్ డిమాండ్ చేశాడు.
ఒలింపిక్స్ షాక్: డోప్ పరీక్షలో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ విఫలం
నర్సింగ్యాదవ్ కోచ్ జగ్మల్ సైతం కుట్ర అభిప్రాయమే వ్యక్తం చేశాడు. అతడి రియో అవకాశాలు దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. నర్సింగ్ పరువు తీయాలని, వెనక్కి తగ్గేలా చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు భారత రెజ్లింగ్ సమాఖ్య సైతం నర్సింగ్కు మద్దతుగా నిలిచింది. నర్సింగ్ యాదవ్ అమాయకుడని, అతడి రెజ్లింగ్ చరిత్ర స్వచ్ఛమైనదని, ఇదేదో విద్రోహంలా కనిపిస్తోందని పేర్కొంది.
రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షలో పాజిటివ్ తేలడం పట్ల భారత రెజ్లింగ్ సమాఖ్య కూడా అనుమానం వ్యక్తం చేసింది. నర్సింగ్ యాదవ్తో పాటు తన రూమ్ భాగస్వామి సందీప్ తులసీ యాదవ్ కూడా ఒకేరకమైన ఉత్ర్పేరకం వాడినట్లు నిర్ధారణ అయ్యింది.
తనపై కుట్ర జరిగిందని నర్సింగ్ లేఖలో ఫిర్యాదు చేసినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధికారి బీబీ శరణ్ సింగ్ తెలిపారు. తనకు కూడా నర్సింగ్ డోప్ పరీక్ష పట్ల అనుమానం ఉన్నట్లు శరణ్ పేర్కొన్నారు. నర్సింగ్కు అన్యాయం జరిగిందని సమాఖ్య కూడా భావిస్తుందని, కమిటీ ఈ సమస్యను పరిష్కరిస్తుందన్న శరణ్ అశాభావాన్ని వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రియో అథ్లెట్లకు శిక్షణ జరుగుతోందన్నారు.
డోప్ పరీక్షలో దొరికిన నర్సింగ్ యాదవ్ రూమ్మెట్ రెజ్లర్ సందీప్
నాడా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో రెజ్లర్ సందీప్ యాదవ్ కూడా విఫలమైనట్లు తేలింది. కాగా రెజ్లర్ సందీప్.. నర్సింగ్ రూమ్మేట్ కావడం గమనార్హం. హర్యానాలోని సోనెపత్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఈ ఇద్దరు రెజ్లర్లు ఒకే గదిలో ఉన్నట్లు కొన్ని మీడియా కథనాల సమాచారం.
గత జూన్ 25న నాడా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో వీరిద్దరూ విఫలమయ్యారు. నిషేధిత మిథేనడైనన్ అనే ఉత్ప్రేరకాలను తీసుకున్నట్లు నివేదికలో తేలింది. ఆగస్టులో జరగబోయే రియో ఒలింపిక్స్కు నర్సింగ్ ఎంపికవగా.. సందీప్ అర్హత సాధించలేదు. కాగా.. డోపింగ్ వివాదంతో నర్సింగ్ రియో ఆశలు ప్రశ్నార్థకంగా మారాయి.