హైదరాబాద్: ఇద్దరు జాతీయ స్థాయి తైక్వాండో క్రీడాకారిణులపై శిక్షణ ఇస్తున్న కోచ్ అత్యాచారం జరిపిన సంఘటన తాజాగా వెలుగు చూసింది. జార్ఖండ్లో జరిగిన ఈ అత్యాచార ఘటనపై ఇద్దరు మహిళా క్రీడాకారిణులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తొమ్మిదో తరగతి చదువుతున్న క్రీడాకారిణులు తైక్వాండో ట్రైనింగ్ కోసం అతడి వద్ద శిక్షణకు చేరారు. అయితే ఒకరోజు కోచ్కి ఫోన్ చేయగా ఇంటి రమ్మని, ఇంటికి వచ్చిన తర్వాత మత్తు మందు కలపిన కూల్ డ్రిండ్ ఇచ్చి ఆ తర్వాత క్రీడాకారిణిపై కోచ్ అత్యాచారం జరిపాడు.
స్పృహలోకి వచ్చిన తర్వాత దీనిపై కోచ్ని ప్రశ్నిస్తే అభ్యంతరకరంగా ఉన్న అశ్లీల చిత్రాలు, వీడియో చూపి దీనిపై ఫిర్యాదు చేస్తే వీటిని బయటపెడతానని కోచ్ బెదిరించాడని ఢిల్లీ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
క్రీడాకారిణులపై అత్యాచారం జరిపిన ఆ కోచ్ జార్ఖండ్ తైక్వాండో అసోసియేషన్ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే తనకు భోజనంలో మత్తు మందు కలిపి ఇచ్చి తనపై కూడా కోచ్ అత్యాచారం జరిపాడని మరో క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోచ్ తమపై అత్యాచారం చేయడమే కాకుండా తమ అశ్లీల చిత్రాలు, వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ గత ఎనిమిదేళ్లుగా తమపై అత్యాచారం చేస్తున్నాడని బాధిత క్రీడాకారిణులు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కోచ్కు జార్ఖండ్ రాజకీయ నేతలతో సంబంధాలు ఉండటంతో క్రీడాకారిణిలు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. వీరిద్దరి ఫిర్యాదుతో కోచ్పై ఢిల్లీలోని కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇద్దరు క్రీడాకారిణుల ఫిర్యాదుపై తాము దర్యాప్తు చేపట్టామని ఢిల్లీ డీసీపీ మణదీప్ రాంధ్వా చెప్పారు.