హైదరాబాద్: స్వల్ప విరామం అనంతరం భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్లు మళ్లీ రాకెట్ పట్టేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం ప్రారంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో వీరంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇటీవల ముగిసిన జపాన్ ఓపెన్లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈ టోర్నీలో సత్తా చాటాలని ఊవిళ్లూరుతున్నారు. ఈ టోర్నీలో భారత్ నుంచి ఇద్దరు షట్లర్లు టోర్నీ ఫేవరేట్గా బరిలోకి దిగుతున్నారు. రియో ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్షిప్లో రజతం గెలిచిన పీవీ సింధు రెండో సీడ్గా బరిలోకి దిగనుంది.
ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న పీవీ సింధు ఇప్పటికే ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్లను తన ఖాతాలో వేసుకుంది. టోర్నీ ఆరంభ రౌండ్లో పదో ర్యాంకర్ చైనా చెన్ యుఫెయ్తో సింధు తలపడనుంది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్స్లో చెన్ను సింధు ఓడించిన సంగతి తెలిసిందే.
ఇక సైనా విషయానికి వస్తే కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడనుంది. ముఖాముఖీ పోరుల్లో ఈ ఇద్దరూ 4-4తో సమంగా నిలిచారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఎమిల్ (డెన్మార్క్)తో ప్రణయ్, హాన్స్ క్రిస్టియన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్, క్వాలిఫయర్స్తో శ్రీకాంత్, సమీర్వర్మ పోటీపడతారు.
ఇక, పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ ఫేవరెట్గా ఉన్నాడు. వరుసగా మూడు టోర్నీల్లో ఫైనల్కు చేరిన అతను ఇండోనేసియా, ఆస్ట్రేలియా టైటిళ్లు గెలిచాడు. క్వాలిఫయర్ ఆటగాడితో అతను ఈ టోర్నీని ఆరంభించనున్నాడు. క్వార్టర్స్లో కిదాంబికి స్ధానిక ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్ రూపంలోగట్టి పోటీ ఎదురయ్యే ఆస్కారం ఉంది.