హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ ఓటమికి బ్రేక్ పడింది. లీగ్లో భాగంగా తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ జట్ల మధ్య మంగళవారం ఉత్కంఠ రేపిన మ్యాచ్ చివరకు 21-21తో టైగా ముగిసింది. చివర్లో తెలుగు టైటాన్స్ పుంజుకున్న తీరు అమోఘం.
చివరి మూడు నిమిషాల్లో తెలుగు టైటాన్స్ 15-20తో వెనుకబడి ఉంది. ఇక టైటాన్స్ ఖాతాలో వరుసగా ఆరో ఓటమి జమ అయినట్లే అని అంతా ఓ అంచనాకు వచ్చారు. కానీ ఆఖరి మూడు నిమిషాల్లో టైటాన్స్ పుంజుకుని మ్యాచ్ గెలిచేసేలా కూడా కనిపించింది.
అయితే పాయింట్లు సమం కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. తొలి అర్ధభాగంలో బెంగళూరు 9-8తో పాయింట్ తేడాతో ఆధిక్యంలో నిలువగా... రెండో అర్ధభాగంలో మ్యాచ్ జరిగేకొద్దీ టైటాన్స్ పుంజుకుంది. ఇక, బెంగళూరు బుల్స్ ఆటగాళ్లు జోరు పెంచి ఆధిక్యాన్ని 20-15కు తీసుకెళ్లారు.
ఆఖరి మూడు నిమిషాల్లో రక్షిత్ రైడ్కు వెళ్లి 2 పాయింట్లు తెచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ రాహుల్ చౌదరి కూడా రైడ్లో రెండు పాయింట్లు సాధించాడు. దీంతో స్కోరు 20-20తో సమమైంది. తర్వాతి రైడ్లో బుల్స్కు బోనస్ పాయింట్ లభించగా.. చివరగా రాహుల్ రైడ్కు వెళ్లి ఒక పాయింట్ తేవడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
ఈ మ్యాచ్లో టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి రాణించాడు. 29 సార్లు రైడింగ్కు వెళ్లి 8 పాయింట్లు సాధించాడు. అతడికి మిగతా ఆటగాళ్ల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదు. నీలేశ్ సాలుంకే 4, రాకేశ్, విశాల్ భరద్వాజ్ చెరో 2 పాయింట్లు, టాకిల్లో రాకేశ్ కుమార్ 2 పాయింట్లు చేశారు.
There's no separating @BengaluruBulls and @Telugu_Titans as #BLRvHYD finishes 21-21! #LePanga
— ProKabaddi (@ProKabaddi) 8 August 2017
బెంగళూరు జట్టులో రోహిత్ కుమార్ ఐదు రైడ్ పాయింట్లతో టాప్స్కోరర్గా నిలిచాడు. ఆశిష్ 3 పాయింట్లు చేయగా మహేందర్, ప్రీతమ్ చిల్లర్, రవీందర్ పాహల్ తలా రెండు పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 32-20తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది.
తొలి అర్ధభాగం ముగిసేసరికి 13-9తో ఆధిక్యంలో నిలిచిన హర్యానా రెండో అర్ధభాగంలో విజృంభించి ఆడింది. టోర్నీలో మూడు మ్యాచ్లు ఆడిన హర్యానాకు ఇదే తొలి విజయం కాగా.. అన్ని మ్యాచ్లే ఆడిన గుజరాత్కు ఇదే తొలి ఓటమి. ఇక బుధవారం జరిగే మ్యాచ్లో బెంగళూరు బుల్స్... బెంగాల్ వారియర్స్తో తలపడుతుంది.
ఈ మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి 'స్టార్ స్పోర్ట్స్-2'లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.