హైదరాబాద్: రియో ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధుకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. పీవీ సింధు పేరును ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుకు కేంద్ర క్రీడాశాఖ సిఫారసు చేసింది. ఈ మేరకు క్రీడాశాఖ సోమవారం నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ప్రపంచ నెంబర్ 2 ర్యాంకులో కొనసాగుతున్న సింధు బ్యాడ్మింటన్లో వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సంగతి తెలిసిందే. గతేడాది రియోలో జరిగిన ఒలింపిక్స్ ఫైనల్లో పీవీ సింధు కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇటీవలే జపాన్కు చెందిన నోజోమి ఒకుహరాను కొరియా ఓపెన్ సూపర్ సిరిస్ పైనల్లో ఓడించి ఈ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది పీవీ సింధు గెలిచిన మూడో సూపర్ సిరిసి టైటిల్ ఇది.
ఇటీవల బ్యాడ్మింటన్లో ఆమె సాధిస్తోన్న వరుస విజయాలను గుర్తించిన కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ సింధు పేరును పద్మభూషణ్కు ప్రతిపాదించింది. సింధు 2013లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ, 2016లో రాజీవ్ ఖేల్రత్న అవార్డులను అందుకుంది.
కాగా, సోమవారం క్రీడాశాఖ చేసిన సిఫారసును ప్రస్తుతం హోం శాఖ పరిశీలిస్తుంది. తమ దగ్గరకు వచ్చిన సిఫారసులను పరిశీలించిన తర్వాత పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. ఇటీవల క్రికెటర్ మహేంద్ర ధోనీ పేరును బీసీసీఐ సిఫారసు చేస్తే కేంద్రం దానిని సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి.
#FLASH: Indian shuttler PV Sindhu recommended for Padma Bhushan by Sports Ministry pic.twitter.com/kcjkpUwtED
— ANI (@ANI) September 25, 2017