హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బుధవారం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు అందించనున్నట్లు రాష్ట్ర భూపరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీత మంగళవారం చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న సీసీఎల్ఏ కార్యాలయానికి చేరుకున్న సింధు ఉద్యోగంలో చేరుతున్నట్లు కమిషనర్కు రిపోర్ట్ చేశారు. అనంతరం ఐఏఎస్ అధికారి జగన్నాథం సమక్షంలో డిప్యూటీ కలెక్టర్గా సింధు సంతకం చేశారు. ఈ సందర్భంగా సింధుకు సీసీఏల్ఏ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు.
అయితే, ఆమెకు ఎలాంటి పనులు అప్పగిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. కొద్దిరోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రియో ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం సాధించిన సింధుకు ఏపీ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇటీవలే సింధును డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నియామక పత్రాన్ని కూడా అందజేసిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం మంచిరోజు కావడంతో ఈరోజు సింధు విధుల్లోకి చేరింది. డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సింధు మీడియాతో మాట్లాడారు.
డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ఇరు రాష్ట్రాల సీఎంలకు సింధు కృతజ్ఞతలు తెలిపారు. గోపీచంద్ అకాడమీలో మంచి శిక్షణ పొందుతున్నానని, రాబోయే వరల్డ్ చాంపియన్ షిప్స్లో బాగా ఆడి విజయం సాధిస్తానని సింధు తెలిపారు.