రియో డి జనీరో: భారతీయ టెన్నిస్ క్యాంప్లో ఇబ్బందులు ఇంకా కుదుటపడినట్లు కనిపించడం లేదు. భారత టెన్నిస్ దిగ్గజం, ఆరు సార్లు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్కు రియోలో అవమానం జరిగింది. ఒలింపిక్స్లో పాల్గొనేందుకు ఆగస్టు 4 (గురువారం) అక్కడికి చేరుకున్న పేస్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలిసింది.
43 ఏళ్ల లియాండర్ పేస్కు రియోలోని ఒలింపిక్ గ్రామంలో గది ఇవ్వలేదని తెలుస్తోంది. ఒలింపిక్స్ కోసం రియోకు వచ్చిన పేస్కు అధికారులు గదిని ఇవ్వక పోవడంతో తన బ్యాగులు, సామానును చెఫ్ రాకేష్ గుప్తా రూంలోనే పెట్టుకోవాల్సి వచ్చిందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో పేర్కొంది.
ఒలింపిక్ గ్రామంలో తాను ఉండేందుకు ఓ చోటును కూడా చూపకపోవడం అసంతృప్తిని కలిగించిందని పేస్ వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. న్యూయార్క్లో 8 గంటలకు ఓ టోర్నమెంటును ముగించుకున్న తాను, 10:45 గంటలకు విమానం ఎక్కి రియోకు చేరానని పేర్కొన్నాడు.
గది లేకపోవడంతో వెంటనే ప్రాక్టీస్కు వెళ్లిపోయానని, సాయంత్రానికి గది దొరుకుందని తాను భావిస్తున్నానని తెలిపాడు. కాగా, తన టెన్నిస్ భాగస్వామి రోహన్ బొపన్నతో కలసి ఒకే గదిలో ఉండేందుకు లియాండర్ నిరాకరించినట్టు తెలుస్తోంది. కాగా, బొపన్న, అలీ, టెన్నిస్ ఫిజియోలు మూడు రూములను తీసుకున్నారని పేస్ ఆరోపించాడని అందులో పేర్కొంది.
ఇప్పటికే ఒలింపిక్ గ్రామానికి చేరుకున్న రోహన్ బోపన్న విదేశీ ఆటగాళ్లతో ప్రాక్టీసు మొదలుపెట్టాడు. 1996లో అట్లాంటాలో జరిగిన ఒలింపిక్స్లో పేస్ కాంస్యం పతకాన్ని సాధించాడు. లియాడర్ పేస్, రోహన్ బోపన్న జోడీ తమ తొలి మ్యాచ్ని పోలాండ్పై ఆగస్టు 6వ తేదీ రాత్రి 7:30 గంటలకు ఆడనున్నారు. రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ పేస్కు చివరి ఒలింపిక్స్ కానుంది.
goodbye @WashKastles, hello @Rio2016_en Olympics! @Leander pic.twitter.com/FuiFyulv5R
— Martina Hingis (@mhingis) August 4, 2016