రియో డీ జెనిరో: రియో ఒలింపిక్స్లో భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ నిరాశపరిచాడు. అతనికి ఆదివారం నాడు తొలి రౌండ్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫ్రీ స్టయిల్ 65 కిలోల అర్హత పోరులో గంజోరిగ్ మందకనరన్ (మంగోలియా) చేతిలో ఓటమి పాలయ్యాడు.
ప్రథమార్ధంలో 0-1తో వెనకబడిన యోగేశ్వర్ దత్ ద్వితీయార్ధంలోనూ పుంజుకోలేదు. యోగేశ్వర్ ప్రత్యర్థి కాళ్లను పట్టుకొనేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ దశలో గంజోరిగ్ 3-0తో మరింత ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. సాక్షి మాలిక్ పోరులో జరిగినట్లు ఆఖరి నిమిషంలో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా అని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది.
కాగా, గంజోరిగ్ ఫైనల్కు చేరుకుంటే రెపిచేజ్ ద్వారా యోగేశ్వర్ దత్కు మరో అవకాశం లభిస్తుంది. మంగోలియా రెజ్లర్ గంజోరిగ్ ప్రపంచ ర్యాంకింగులో 9వ స్థానంలో ఉన్నాడు.
క్వార్టర్లోనే మంగోలియా ఆటగాడు ఔట్, యోగేశ్వర్కు నో ఛాన్స్
ప్రత్యర్థి గంజోరిగ్ ఫైనల్కు వెళ్తే రెఫిచేజ్ ద్వారా యోగేశ్వర్కు మరో అవకాశం వచ్చి ఉండేది. కానీ మంగోలియా ఆటగాడు గంజోరిగ్ క్వార్టర్స్లోనే ఓడిపోయాడు. దీంతో యోగేశ్వర్కు, భారత్కు నిరాశ మిగిలింది.
దీపా కర్మాకర్కు కేసీఆర్ ప్రోత్సాహం
రియో ఒలింపిక్స్లో జిమ్నాస్టిక్స్ విభాగంలో తృటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్కు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రోత్సాహకం ప్రకటించారు. ఆమెకు రూ.50 లక్షలు ప్రకటించారు. రజతం గెలిచిన తెలుగుతేజం పీవీ సింధుకు రూ.5 కోట్లు, కోచ్ గోపీచంద్కు రూ.1కోటి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆలాగే కాంస్యం గెలిచిన సాక్షి మాలిక్కు రూ.1 కోటి ప్రకటించారు.