న్యూఢిల్లీ: తాను ఎనిమిదేళ్ల క్రితమే ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. ఆ సమయంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆపకపోతే తాను అప్పుడే క్రికెట్కు గుడ్ బై చెప్పేవాడినని తెలిపాడు. తనకు సెలెక్టర్లు మ్యాచ్ ఆడుతూ రిటైరయ్యేందుకు అవకాశమైనా ఇవ్వలేదని వాపోయాడు.
37వ పుట్టినరోజున ఆటకు వీడ్కోలు పలికిన వీరూ తన నిర్ణయంపై మాట్లాడుతూ.. 'ప్రతి క్రికెటర్ అత్యుత్తమ దశలోనే ఆటకు వీడ్కోలు పలకాలనుకుంటాడు. నేనూ చివరి మ్యాచ్ ఆడి క్రికెట్కు గుడ్బై చెప్పేవాడిని.. అందరిలానే వీడ్కోలు ప్రసంగం ఇచ్చివుండేవాడిని.. కానీ, నా రాత మరోలా ఉంది. 2007లో జట్టులో చోటు కోల్పోయిన రోజే ఆటను వదిలేద్దామనుకున్నా. తొందరపాటు నిర్ణయం వద్దని సచిన్ వారించాడు' అని సెహ్వాగ్ చెప్పాడు.
అంతర్జాతీయ క్రికెట్లో 2012 అక్టోబరు 2న ఆఖరి టీ20.. 2013 జనవరిలో చివరి వన్డే ఆడాడు సెహ్వాగ్. అదే ఏడాది ఆస్ట్రేలియా (మార్చి)తో జరిగిన టెస్టే అతడికి ఆఖరి మ్యాచ్. కొన్ని వైఫల్యాలకే సెలెక్టర్లు తనను జట్టు నుంచి తప్పించారని, మ్యాచ్ ఆడుతూ రిటైరయ్యేందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పాడు.
'2013 ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలో తప్పించే సమయంలో సెలెక్టర్లు.. భవిష్యత్ ప్రణాళికల గురించి నన్నేమీ అడగలేదు. ఇక జట్టులోకి ఎంపిక చేయకూడదనుకుంటున్నట్లు వారు స్పష్టం చేసివుంటే.. ఆ సిరీస్లోనే రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించి ఉండేవాడ్ని' అని అన్నాడు.
వీడ్కోలుపై తన కుటుంబం ఏ మాత్రం ఆనందంగా లేదన్నాడు. 'నా ఇద్దరు కుమారులు అసంతృప్తికి లోనయ్యారు. కానీ అవేమీ పట్టించుకోను' అని సెహ్వాగ్ చెప్పాడు.
కుంబ్లేనే అత్యుత్తమ కెప్టెన్
కాగా, తన కెరీర్లో కుంబ్లేనే అత్యుత్తమ కెప్టెన్ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. 'నా కెప్టెన్లలో కుంబ్లేనే అత్యుత్తమం. అతడు ఆటగాళ్లలో విశ్వాసాన్ని పెంపొందించేవాడు. క్రికెట్ ఆడకపోయినా ఆటకు మాత్రం దూరం కాను. బీసీసీఐ ఏదైనా బాధ్యతలు అప్పగించాలనుకుంటే పరిశీలిస్తా. వ్యాఖ్యాతగా అవకాశమున్నా ఆలోచిస్తా. నా వ్యాఖ్యానం కూడా నా ఆటలాగే ఉంటుంది. డొంకతిరుగుడు ఉండదు' అని సెహ్వాగ్ అన్నాడు.
ప్రస్తుతం హర్యానా తరఫున రంజీ మ్యాచ్లు ఆడుతున్న వీరేంద్ర సెహ్వాగ్.. సచిన్-షేన్వార్న్లతో కలిసి నవంబరులో అమెరికాలో జరగనున్న ఆల్ స్టార్స్ క్రికెట్ సిరీస్లో ఆడబోతున్నాడు.