సిడ్నీ: ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టైటిల్ అందుకునేందుకు భారత్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ అడుగు దూరంలో ఉంది. ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ పైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో వరల్డ్ నెంబర్-2 షట్లర్ వాంగ్(చైనా)పై 21-8, 21-12తో సైనా విజయం సాధించింది.
దీంతో సైనా నెహ్వాల్ ఫైనల్ పోరులో బెర్తు ఖరారు చేసుకుంది. జూన్ 12న జరగనున్న ఫైనల్లో లండన్ ఒలింపిక్స్ కాంస్యం సాధించిన చైనా క్రీడాకారిణి సన్ యుతో సైనా తలపడనుంది. ప్రస్తుతం సన్ యు వరల్డ్ బ్యాట్మింటన్ ర్యాంకింగ్లో 12వ స్థానంలో కొనసాగుతోంది.
2014లో జరిగిన ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో సన్పై 5-1 తేడా రికార్డు విజయాన్ని సైనా నెహ్వాల్ నమోదు చేసి టైటిల్ను సొంతం చేసుకుంది. అయితే 2013లో జరిగిన చైనా ఓపెన్ టోర్నీలో సైనాపై సన్ పైచేయి సాధించింది. కాగా, శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో థాయిలాండ్ క్రీడాకారిణి రచనోక్ పై గెలుపొంది సెమీ ఫైనల్కి చేరింది.
మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. పురుషుల విభాగంలో హన్స్ క్రిస్టియన్(డెన్మార్క్) చేతిలో 22-20, 21-13 తేడాతో శ్రీకాంతి ఓటమి పాలయ్యాడు. ఓపెనింగ్ గేమ్లో శ్రీకాంత్కు గెలిచే అవకాశం లభించినప్పటికీ, దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.