హైదరాబాద్: భారత్ స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, అజయ్ జయరాం మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ తొలిరౌండ్లో థాయ్లాండ్ క్రీడాకారిణి చాసైనీ కోరిపాప్తో తలపడింది.
ఆటలో మొదటి నుంచి సైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రత్యర్ధి చాసైనీ కోరిపాప్కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సత్తా చాటింది. కేవలం రెండు సెట్లతోనే ఫలితం రాబట్టి 21-9, 21-8తో తొలి రౌండ్లో విజయం సాధించింది.
ఈ విజయంతో సైనా నెహ్వాల్ మలేసియా మాస్టర్స్ టోర్నీలో ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్లో ఇండోనేషియా క్రీడాకారిణి హన్నా రమదినితో తలపడనుంది. రియో ఒలింపిక్స్ అనంతరం మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సైనా ఆ తర్వాత ఆడిన టోర్నీల్లో ఆశించిన మేరకు రాణించలేదు.
ఇదిలా ఉంటే పురుషుల సింగిల్స్లో అజయ్ జయరాం ఇండోనేషియా ఆటగాడు సప్తుర విక్కి అంగాపై 21-9, 21-12 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో చైనీస్ తైపీ హుయాన్ యుతో తలపడనున్నాడు.
మిక్స్డ్ డబుల్ విభాగంలో మను అట్టారీ, జ్వాలా గుత్తా జోడీ ఇండోనేషియాకు చెందిన లుకీ అప్రీ నుగ్రో, రిరిన్ అమెలియా జోడీపై 21-19, 21-18 తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్లో
భారత్కు చెందిన సుమీత్ రెడ్డి, అశ్విని పొన్నప్పల జోడీ ఇండోనేషియాకు చెందిన ఆరో సీడ్ అహ్మద్, గ్లోరియా చేతిలో ఓటమి పాలైంది.