ఢిల్లీ: ఒలింపిక్స్ ముందే భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. డోప్ పరీక్షలో ప్రఖ్యాత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ విఫలమయ్యాడు. దీంతో రియో ఒలింపిక్స్లో నర్సింగ్ యాదవ్ పాల్గొనటంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. జులై5న నాడా(నేషనల్యాంటీ డోపింగ్ ఏజెన్సీ) నర్సింగ్కు సోనెపట్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డోపింగ్ పరీక్ష నిర్వహించింది.
'ఏ' శాంపుల్ వైద్యపరీక్షల్లో పాజిటీవ్ రావడంతో కొద్దిరోజుల తర్వాత నర్సింగ్కు 'బి' శాంపుల్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఇందులోనూ పాజిటీవ్ రావడంతో ఆగస్ట్లో జరగనున్న రియో ఒలింపిక్స్ నుంచి సస్పెండ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నర్సింగ్యాదవ్కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతని శరీరంలో బ్యాన్ చేసిన స్టెరాయిడ్లు ఉన్నట్లు తేలిందని నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపారు. శనివారం నర్సింగ్ను డిసిప్లీనరీ ప్యానెల్ ఎదుట హాజరయ్యాడని ఈ కేసులో నర్సింగ్కి సంబంధించిన మరిన్ని నివేదికలు ప్రవేశపెట్టాల్సిందిగా ప్యానెల్ ఆదేశించిందని పేర్కొన్నారు.
ప్యానెల్ ఇచ్చే తీర్పును బట్టి ఈ విషయంలో ఏం చేయాలన్నది ఆలోచిస్తామని అగర్వాల్ చెప్పారు. ఒలింపిక్స్ కుస్తీ క్రీడాంశంలో 74 కేజీల విభాగంలో నర్సింగ్యాదవ్ పోటీ పడనున్నారు. గతేడాది ప్రపంచ కుస్తీ పోటీల్లో కాంస్యం సాధించిన నర్సింగ్ ఒలింపిక్స్ బెర్త్ సాధించాడు.
ఈ నేపథ్యంలో రెజ్లర్ సుశీల్ కుమార్ స్థానంలో నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్కు ఈ ఏడాది ఎంపికైన విషయం తెలిసిందే. అయితే డోపింగ్ పరీక్షలో విఫలమైన కారణంగా రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్ ప్రాతినిథ్యం అనుమానంగా మారింది.