హైదరాబాద్: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్ ఫైనల్స్కు దూసుకెళ్ళారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సాయి ప్రణీత్ మూడు సార్లు కొరియా మాస్టర్స్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ విన్నర్గా నిలిచిన లీడాంగ్ (కొరియా)పై 21-6, 21-8 తేడాతో విజయం సాధించాడు.
సుమారు 38నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో ప్రణీత్ 21-6, 21-8తో రెండు వరుస సెట్లను కైవసం చేసుకుని ఫైనల్కి దూసుకెళ్లాడు. 2007 నుంచి ఈ సిరీస్లో పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్కి చేరిన తొలి భారతీయుడు సాయి ప్రణీత్ అరుదైన గుర్తింపు పొందాడు. 30వ ర్యాంకర్ సాయిప్రణీత్ అద్భుతమైన ఆటతో తన ప్రత్యర్థి లీని చిత్తుచేశాడు.
మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్ధిపై పైచేయి సాధించాడు. ఈ ఏడాది సాయి ప్రణీత్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టోర్నీలో కూడా ఫైనల్స్ వరకు దూసుకెళ్లాడు. హైదరాబాద్కు చెందిన 24 ఏళ్ల సాయి ప్రణీత్ గతేడాది కెనడా ఓపెన్లో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.
మరో సెమీఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ ఆంథోనీ గింటింగ్ (ఇండోనేసియా)పై కిదాంబి శ్రీకాంత్ 21-13, 21-14తో విజయం సాధించాడు. సుమారు 42 నిమిషాల పాటు జరిగిన పోరులో శ్రీకాంత్ 21-13, 21-14తో రెండు వరుస సెట్లను గెలుచుకున్నాడు. దీంతో టైటిల్ కోసం సాయి ప్రణీత్తో కిదాంబి శ్రీకాంత్ తలపడనున్నాడు.
ఇదిలా ఉంటే సింగపూర్ ఓపెన్లో ఒలింపిక్ రజత పతక విజేత పీవి సింధు పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు 11-21, 15-21తో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్లో సుమీత్రెడ్డి- అశ్విని పొన్నప్ప 11-21, 8-21తో లూ కాయ్- హువాంగ్ (చైనా) చేతిలో ఓడారు.