న్యూఢిల్లీ/కోల్కతా: మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ టీమిండియా కోచ్ కాబోతున్నాడన్న ప్రచారం రోజురోజుకూ విస్తృతమవుతోంది. అయితే గంగూలీ మాత్రం దీన్ని కొట్టిపారేయడం లేదు, అంతేగాక, అంగీకరించడం లేదు కూడా. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కోచ్ రేసులో ఉన్నారా లేదా అన్న ప్రశ్నకు బదులివ్వకుండా.. 'దీని గురించి ఏమీ మాట్లాడను. ఊహాగానాలు కట్టిపెట్టండి. ఓ అభిప్రాయానికి రాకండి' అని గంగూలీ తెలిపాడు. మీరు కోచ్ అవుతున్నారటగా అని దాదా దగ్గర ప్రస్తావిస్తే.. ''ఈ సంగతి తొలిసారి వింటున్నా'' అని గంగూలీ బదులిచ్చాడు.
కోచ్ పదవిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) అధ్యక్షుడు దాల్మియాతో మాట్లాడినట్లు వస్తున్న వార్తలపై మాట్లాడుతూ.. 'అలాంటిదేమి లేదు. ఎవరా మాట అన్నది. బిసిసిఐ నుంచి ఎవరూ నాతో మాట్లాడలేదు. నేను కూడా ఎవరితో మాట్లాడలేదు. అదీ నిజం. దానికే అందరం కట్టుబడదాం' అని దాదా పేర్కొన్నాడు.
బెంగాల్ క్రికెట్ సంఘానికి దాల్మియా అధ్యక్షుడు, తాను కార్యదర్శి కావడం వల్ల ఇద్దరం రోజూ కలుస్తుంటామని.. అంతకుమించి ఏమీ లేదని చెప్పాడు. కోచ్ పదవి రేసులో రాహుల్ ద్రవిడ్ కూడా ఉన్నాడన్న ప్రచారంపై మాట్లాడుతూ.. 'మేమిద్దరం మంచి కోచ్లు కాగలం. రాహుల్ గొప్ప ఆటగాడు' అని గంగూలీ తెలిపాడు.
కాగా, ఏప్రిల్ 26న జరగనున్న బిసిసిఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో డంకన్ ఫ్లెచర్ తర్వాత భారత జట్టు కోచ్ ఎవరన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సౌరవ్ గంగూలీ లేదా రాహుల్ ద్రావిడ్ కోచ్ పదవులను చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, భారత జట్టుకు వీరిద్దరూ కోచ్లుగా ఉంటే బాగుంటుందని, రవిశాస్త్రి జట్టు డైరెక్టర్గానే ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.