హైదరాబాద్: లండన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పోటీ పడే అవకాశం రావడం ఎంతో గొప్ప. ఈ ఛాంపియన్షిప్లో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు ఈవెంట్లు ఎంతో ప్రత్యేకం. కేవలం 10 నుంచి 20 సెకన్లలో ముగిసిపోయే ఈ పరుగు కోసం అథ్లెట్లు ఎంతో కష్టపడుతుంటారు.
పగలు, రాత్రీ తేడా లేకుండా ఇందులో పాల్గొనేందుకు ఎంతగానో శ్రమిస్తుంటారు. అయితే ఈ రేసుకి సిద్ధమై, అనారోగ్యం కారణంగా పోటీకి దూరమైతే ఆ బాధను వర్ణించడం కష్టం. బోట్స్వానాకు చెందిన అథ్లెట్ ఐజాక్ మక్వాలా పరిస్థితి ప్రస్తుతం ఇలానే ఉంది.
ప్రస్తుతం లండన్లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 200 మీటర్లు, 400 మీటర్ల పరుగులో మక్వాలా ఫేవరెట్లలో ఒకడిగా ఉన్నాడు. అయితే లండన్లో అతడు బస చేస్తున్న హోటల్లో కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే కడుపు నొప్పి వచ్చింది.
దీంతో అతడు 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో పోటీ పడలేకపోయాడు. మక్వాలా రేసు బరిలో ఉంటే రెండు పోటీలో ఉంటే పతకం సాధించేవాడని ఆ దేశ క్రీడాభిమానులు భావించారు. అయితే నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఎంతో విలువైన వరల్డ్ అథ్లెటిక్స్లో పతకాలు కోల్పోయానని మక్వాలా తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.
మక్వాలాతో పాటు అదే హోటల్లో బస చేసిన మరో 30 మంది క్రీడాకారులు కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలయ్యారు. వీరిలో బోట్స్వానా, జర్మనీ, కెనడా, ఐర్లాండ్, ప్యూర్టోరికా అథ్లెట్లు ఉన్నారు. వీరిలో కొందరు పోటీలకు దూరంకాగా మరికొందరికి అనారోగ్యం పాలైన అథ్లెట్లకు ప్రస్తుతం చికిత్సని అందిస్తున్నారు.