హైదరాబాద్: లండన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పురుషుల 200 మీటర్ల పరుగు పందెంలో బోట్స్వానా స్ప్రింటర్ ఇసాక్ మక్వాలా ఒక్కడి కోసం హీట్స్ నిర్వహించారు. అసలు హీట్స్ ముగిసిన రెండు రోజుల తర్వాత అదీ.. సెమీస్కు రెండు గంటల ముందు.
వివరాల్లోకి వెళితే షెడ్యూల్ ప్రకారం సోమవారం నిర్వహించిన హీట్స్-5లో మక్వాలా బరిలోకి దిగాల్సి ఉంది. అయితే నోరోవైరస్ కారణంగా అతను గ్యాస్ట్రోఎంటరైటిస్కు గురయ్యాడు. దీంతో రేసు నుంచి వైదొలిగాడు. అంతేకాదు ఈ వ్యాధి సోకిన వారిని పోటీలకు దూరంగా ఉంచారు.
వారందిరినీ ఓ హోటల్లో ఉంచి వైద్య చికిత్స అందిస్తున్న నిర్వాహకులు 48 గంటలు అబ్జర్వేషన్లో పెట్టారు. అయితే మక్వాలా అబ్జర్వేషన్ సమయం బుధవారం మధ్యాహ్నం 2 గంటల (స్థానిక కాలమానం ప్రకారం)కు పూర్తికావడంతో అతను ఫిట్గా ఉన్నాడని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు.
400 మీటర్ల ఫైనల్లో పోటీపడేందుకు అతడు ఫిట్గా ఉన్నప్పటికీ నోరోవైరస్ బాధితుడు కావడంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) అతడిని ఫైనల్కు అనుమతించలేదు. 400 మీటర్ల ఫైనల్ ముందు వార్మప్ ట్రాక్ దగ్గరకు వచ్చిన మక్వాలా 'నాపై కుట్ర జరిగింది. అది చేసింది.. బ్రిటనా, ఐఏఏఎఫా అనేదే తేలాలి' అని ఆరోపించాడు.
మరోవైపు రెండు రోజుల్లో అతడి శరీరంలోని వైరస్ నశించడంతో బోట్స్వానా అథ్లెటిక్స్ సమాఖ్య ఈ విషయాన్ని ఛాంపియన్షిప్ నిర్వాహకుల దృష్టికి తీసుకురావడంతో రేసును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సెమీస్కు అర్హత సాధించాలంటే ఈ రేసును 20.53 సెకన్ల టైమింగ్లో పూర్తి చేయాలని మక్వాలాకు లక్ష్యాన్ని నిర్దేశించారు.
హీట్స్లో తనకు కేటాయించిన ఏడో నంబర్ లైన్లో ఒంటరిగా పరుగెత్తిన మక్వాలా 20.20 సెకన్లలో రేసును ముగించాడు. ఆ తర్వాత రెండు గంటల్లోనే జరిగిన సెమీస్లో మిగతా అథ్లెట్లతో పోటీపడిన అతడు 20.14 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంతో ఫైనల్ చేరాడు. శుక్రవారం రాత్రి 2 గంటల తర్వాత ఫైనల్ జరుగుతుంది.