హైదరాబాద్: జాతీయ స్ధాయిలో సత్తా చాటుతున్న రెజ్లర్ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. తాను నిత్యం ప్రాక్టీస్ చేసే స్టేడియంలోనే కరెంట్ షాక్తో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. ఈ సంఘటన రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో మంగళవారం చోటు చేసుకుంది.
జార్ఖండ్ స్టేట్ రెజ్లింగ్ అసోసియేషన్ అధీనంలోని స్టేడియంలో వర్షపు నీరు చేరడం, షార్ట్ సర్క్యూట్ కావడంతో ఆ నీటిలో విద్యుత్ ప్రవహించి 25 ఏళ్ల రెజ్లర్ విశాల్ కుమార్ వర్మ చనిపోయాడు. విద్యుత్ షాక్తో విశాల్ వర్షలు నీటిలోనే అపస్మార స్థితిలో పడిపోయాడు.
దీన్ని గమనించిన స్టేడియం సిబ్బంది విశాల్ కుమార్ వర్మను అక్కడి వారు సర్దార్ ఆసుపత్రికి తీకుకెళ్లగా అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోలా నాథ్ సింగ్ తెలిపారు.
1978లో నిర్మించిన ఈ ఇండోర్ స్టేడియం వర్షం కారణంగా పూర్తిగా నిండిపోయింది. అయితే నిండా నీటిలో మునిగి ఉన్న స్టేడియం కార్యాలయంలోకి ఆయన ఎందుకు వెళ్లాడో తెలియడం లేదని అంటున్నారు.
తక్షణ సాయంగా ఆయన కుటుంబానికి రూ. లక్ష, ఆయన నలుగురు చెల్లెళ్లకూ ఉద్యోగాలు లభించేంత వరకూ నెలకు రూ. 10 వేలు పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్లు జార్ఖండ్ స్టేట్ రెజ్లింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, కోచ్ భాలోనాథ్ సింగ్ చెప్పారు.
కేంద్ర క్రీడా శాఖ నుంచి కూడా రూ. 10 లక్షలు ఇప్పించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, 2005లో తన రెజ్లింగ్ కెరీర్ను ప్రారంభించిన విశాల్, ఇటీవలే జాతీయ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్లో సెమీ ఫైనల్స్ వరకూ వచ్చారు.