SRH vs CSK:రనౌట్ అయిన విలయమ్సన్ ప్రియం గార్గ్కు ఏం చెప్పాడు..?
దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో సన్రైజర్స్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్రైజర్స్ జట్టు 164 పరుగులు సాధించిందంటే అందుకు కారణం ప్రియం గార్గ్. అప్పటికే బెయిర్స్టో, వార్నర్లు అవుటయ్యారు. క్రీజులో ప్రియం గార్గ్, సీనియర్ బ్యాట్స్మెన్ కేన్ విలయమ్సన్లు ఉన్నారు. సన్రైజర్స్ బ్యాటింగ్ పుంజుకుంటుందనుకుంటున్న దశలో విలయమ్సన్ రనౌట్ అయ్యాడు. విలయమ్సన్ బంతిని షార్ట్ మిడ్ వికెట్ వైపు కొట్టి పరుగు కోసం ప్రయత్నించగా నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న ప్రియం గార్గ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ప్రియం గార్గ్ స్పందించకపోవడంతో అప్పటికే కొంత దూరం వచ్చిన విలయమ్సన్ తిరిగి క్రీజులోకి చేరుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే చెన్నై ఫీల్డర్ అంబటి రాయుడు బంతిని తీసుకుని ధోనీకి ఇవ్వడం ధోనీ స్టంప్స్ను గిరాటేయడం జరిగిపోయాయి. విలయమ్సన్ నిరుత్సాహంతో పెవీలియన్ దారి పట్టాడు. అయితే తొలి మ్యాచ్లో అద్భుతంగా రాణించిన కేన్ విలయమ్సన్ ఔటవడంతో సన్రైజర్స్ అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. టీవీలో మ్యాచ్ చూస్తున్న వారంతా ప్రియం గార్గ్ను తిట్టుకున్నారు. సోషల్ మీడియాలో ప్రియం గార్గ్ ను ట్రోల్ చేశారు. తన కారణంగా విలయమ్సన్ ఔటయ్యాడన్న బాధను దిగమింగుకుని జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ముందుగా కాస్త మందకొడిగా బ్యాటింగ్ ప్రారంభించినా ఆ తర్వాత దూకుడును ప్రదర్శించాడు. హాఫ్ సెంచరీ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.
అయితే ఔటైన విలయమ్సన్ మాత్రం తనకు ధైర్యం చెప్పి వెళ్లాడని మ్యాచ్ అనంతరం గార్గ్ తెలిపాడు. తనను ఔట్ చేసినందుకు బాధపడొద్దని గేమ్ పై ఫోకస్ చేసి మంచి స్కోరు సాధించాలని అభిషేక్ శర్మకు విలయమ్సన్ చెప్పి పంపినట్లు గుర్తు చేశాడు ప్రియంగార్గ్ .ఇక ప్రియం గార్గ్- అభిషేక్ శర్మల జోడి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.ఒక దశలో 77 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ జట్టును వీరి భాగస్వామ్యం 145 పరుగుల వరకు చేర్చింది. ఇక చివరి వరకు క్రీజులో ఉన్న గార్గ్ 23 బంతులను ఎదుర్కొని హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇది ఐపీఎల్లో తన తొలి అర్థసెంచరీ కావడం విశేషం. దీంతో సన్రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
ఇక బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆదినుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. రవీంద్ర జడేజా 51 పరుగులు ధోనీ 47 పరుగులు చేసినప్పటికీ జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చడంలో విఫలమయ్యారు.