ఉద్ధానం ఉద్ధరణకు తొలి అడుగు: సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు:నిధులు మంజూరు
శ్రీకాకుళం: దశాబ్దాల నుంచి పరిష్కారానికి నోచుకోని ఉద్ధానం కిడ్నీ బాధితుల కల నెరవేరబోతోంది. ఉద్ధానం ఉద్ధరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. శ్రీకాకుళం జిల్లాలోని పలాస కేంద్రంగా ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మించబోతోంది. 200 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. మూత్రపిండాల పరిశోధన కేంద్రం, డయాలసిస్ యూనిట్ ఈ ఆసుపత్రికి అనుబంధంగా కొనసాగుతాయి. దీనికోసం తొలి విడతగా 50 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి పలాస పరిసర ప్రాంతాల్లో స్థలాన్ని పరిశీలించిన వారం రోజుల వ్యవధిలోనే 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి.
ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎస్కార్ వాహనం బోల్తా..ముగ్గురికి తీవ్ర గాయాలు
పాదయాత్రలో వాగ్దానం..
ఉద్ధానం ప్రాంతవాసులను పట్టి పీడిస్తోన్న కిడ్నీ సమస్య రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఇదివరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఓ మినీ పోరాటాన్ని చేశారు. ఉద్ధానంలో పర్యటించారు. బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలను స్వయంగా ఆలకించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. అయినప్పటికీ- పెద్దగా ముందడుగు పడలేదు. ఉద్ధానం కిడ్నీ బాధితులు సైతం చంద్రబాబును కలుసుకున్నప్పటికీ.. ఫలితం రాలేదు. దీనితో ఈ వ్యవహారం కాస్తా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను అధికారంలోకి వస్తే.. ఆరు నెలల వ్యవధిలో ఉద్ధానం కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తానని భరోసా కల్పించారు.
హామీని అమలు చేసే దిశగా..
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఉద్ధాన కిడ్నీ సమస్యను పరిష్కరించే దిశగా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు హయాంలో సాధ్యం కాని విషయాన్ని ఆయన తాను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. పలాసలో 200 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించడానికి అవసరమైన పరిపాలనపరమైన నిధులను మంజూరు చేశారు. ఇదివరకే ప్రభుత్వం నిర్మించిన ఓ ప్రతినిధుల బృందం.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పలాస పరిసరాల్లో పరిశీలించింది. ఈ పరిశీలన ముగిసిన వారంరోజుల్లోనే నిధులు మంజూరు అయ్యాయి. త్వరలోనే ఆసుపత్రి నిర్మాణానికి వైఎస్ జగన్ శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అదనపు డైరెక్టర్ స్థాయిలో హోదా గల అధికారిని ఈ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ గా నియమిస్తారు. ఆయనతో పాటు 95 మంది సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారిలో 60 మంది స్టాఫ్ నర్సులుగా ఉంటారు. ఈ 95 మందితో పాటు మరో 60 మంది సిబ్బందిని కాంట్రాక్టు ప్రాతపదికన నియమించుకోవచ్చని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.