32 రోజులైన తెలియని భర్త ఆచూకీ.. ఆస్పత్రికి వెళితే డిశ్చార్జ్ చేశామని, వివాహిత రోదన
కరోనా వల్ల.. రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిక్కోలు జిల్లాలో వివాహిత కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లి.. 32 రోజులవుతున్నా.. ఆచూకీ తెలియడం లేదు. దీంతో ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తన భర్త ఎక్కడ ఉన్నారో చెప్పాలని ఆమె కోరడం.. జాలి కలిగిస్తోంది.
శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన శీర శ్రీనివాసనాయుడు జ్వరంతో బాధపడ్డాడు. గత నెల 16వ తేదీన రాజంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వెంటిలేటర్ లేకపోవడంతో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ రోజు నమూనాలు సేకరించి కరోనా అనుమానిత కేసుగా గుర్తించి జెమ్స్ కొవిడ్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. కొద్దిరోజుల తర్వాత నెగిటివ్ రావడంతో డిశ్ఛార్జి చేయాలని కుటుంబసభ్యులు కోరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని.. రెండు రోజుల్లో పంపిస్తామని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.
తర్వాత కూడా డిశ్ఛార్జి చేయకపోవడంపై కుటుంబసభ్యులు పట్టుబట్టారు. జులై 17వ తేదీనే డిశ్ఛార్జి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో నోరెళ్లబెట్టారు. అడ్రస్ ఇచ్చినా తమకు తెలియకుండా ఎలా డిశ్ఛార్జి చేశారని కుటుంబసభ్యులు ప్రశ్నించారు. క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లి చూడాలని ఆసుపత్రి వర్గాలు ఉచిత సలహా ఇచ్చారు. శ్రీకాకుళం సమీపంలోని టిడ్కో ఇళ్ల కేంద్రంలో గాలించిన ఫలితం లేకపోయింది.
సిబ్బంది తీరుతో విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్ట్ 12వ తేదీన శ్రీకాకుళం గ్రామీణ పోలీస్స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత ఎస్పీ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లగా టూ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. ఆ మేరకు ఫిర్యాదు చేశామని.. 32 రోజులైనా భర్త ఆచూకీ తెలియలేదన్నారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.