Srikakulam: పట్టాల పక్కన విద్యార్థిని మృతదేహం: అత్యాచారం..హత్య: దిశ తరహా ఘటనగా..!
శ్రీకాకుళం: మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలను నిరోధించడానికి దిశ వంటి కఠిన చట్టాలను తీసుకొచ్చినప్పటికీ.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదనడానికి ఉదాహరణగా నిలిచిన ఉదంతం ఇది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటర్మీడియట్ విద్యార్థినిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. మృతదేహాన్ని రైలు పట్టాల పక్కన పడేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడానికి ఆ కామాంధులు మృతదేహాన్ని పట్టాల పక్కన పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతిపై అత్యాచారం చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.
మృతురాలిని వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. పలాసలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లుగా భావిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ఆరంభించారు. పలాస రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆమెపై ఎవరు అత్యాచారానికి పాల్పడ్డారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శనివారం రాత్రి ఈ ఉదంతం చోటు చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడిన కామాంధులకు 21 రోజుల్లోనే ఉరిశిక్షను అమలు చేయడానికి ఉద్దేశించిన దిశ చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ.. అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడట్లేదు. యువతిపై అత్యంత ఘోరమైన అఘాయిత్యానికి పాల్పడిన వారిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.