చంద్రబాబుకు కౌంటర్: తీహార్ జైలుకెళ్లినా సరే..విశాఖలో రాజధాని ఏర్పాటు ఖాయం..స్పీకర్..!
శ్రీకాకుళం: అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా అవసరమైతే తాను ఏ జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై ఎదురుదాడికి దిగారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. చంద్రబాబు తీహార్ జైలుకు వెళ్లినా సరే.. విశాఖపట్నంలో పరిపాలనాపరమైన రాజధాని ఏర్పాటై తీరుతుందని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా నిర్ణయాన్ని తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారని అన్నారు.
తమ్మినేని సీతారాం సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పొందూరులో గ్రామ సచివాలయ భవన నిర్మణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని రాకుండా ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు చూపుతోన్న ప్రేమ.. అమరావతి ప్రాంత రైతులపై కాదని ఆరోపించారు. రియల్టర్ల సంక్షేమం కోసమే చంద్రబాబు కపట నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
అమరావతిలో ఇన సైడ్ ట్రేడింగ్ జరిగిందనే విషయం అందరికీ తెలుసునని, అందులో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ భూములను కొనుగోలు చేశారని విమర్శించారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారనే భయాందోళనలను చంద్రబాబు సృష్టిస్తున్నారని అన్నారు. అమరావతి నుంచి రాజధాని తరలిపోదనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. అమరావతికి అదనంగా మరో రెండు నగరాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.
కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాజధానులను ఏర్పాటు చేయడం వల్ల మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని తమ్మినేని అన్నారు. అదే జరిగితే- టీడీపీకి పుట్టగతులు ఉండవని, ఆ భయంతోనే చంద్రబాబు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పార్టీల నాయకులు హర్షిస్తున్నారని చెప్పారు. న్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి అవసరం లేదా? అని నిలదీశారు.