ఉత్తరాంధ్రపై ఫుల్ ఫోకస్: మరో ఓడరేవు: డీపీఆర్కు అప్రూవల్: ఆ వెంటనే పరిపాలన అనుమతులూ
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రపై అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించినట్టు కనిపిస్తోంది. సాగర నగరం విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించడంతో పాటు.. చుట్టూ మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చింది. భీమిలీ నుంచి విజయనగరం జిల్లాలోని భోగాపురం మధ్య ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి టెండర్లను పిలిచిన వెంటనే.. మరో కీలక ప్రాజెక్టును ప్రకటించంది.
శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు నాన్ మేజర్ పోర్ట్ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ దిశగా అడుగు వేసింది. భావనపాడు ఓడరేవు నిర్మాణానికి అవసరమైన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)కు ఆమోదం తెలిపింది. ఈ డీపీఆర్ ప్రకారమే ప్రభుత్వం భావనపాడు పోర్ట్ నిర్మాణానికి అవసరమైన ప్రారంభ పనులను చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. భావనపాడు నాన్ మేజర్ పోర్ట్ డీపీఆర్పై ఆమోదముద్ర వేస్తూ కొద్దిసేపటి కిందట ఉత్తర్వులను జారీ చేసింది.
మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ (ఐ అండ్ ఐ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ కరికాల వలవేన్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. రైట్స్ సంస్థ ఈ డీపీఆర్ను రూపొందించింది. ఈ ఓడరేవు నిర్మాణాన్ని మూడు దశల్లో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. తొలిదశ కింద 3,669.95 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. పనులను ప్రారంభించిన తేదీ నుంచి 36 నెలల్లో దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని భావిస్తోంది. భూసేకరణ కోసం ప్రారంభదశలో 500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేయగా.. ఇందులో నుంచి సగం మొత్తాన్ని పరిపాలనా అనుమతుల కింద మంజూరు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
పరిపాలనా అనుమతుల కింద 261 కోట్ల రూపాయలను తొలిదశలో కేటాయించాల్సి ఉంటుందని పేర్కొంది. 3,669.95 కోట్ల రూపాయల అంచనా వ్యయం మొత్తంలో 2123 కోట్ల రూపాయలను రుణ రూపంలో సేకరించాలని నిర్ణయించింది. దీనికోసం ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు అనుమతి ఇచ్చింది. భవిష్యత్తులో ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు వచ్చే ఆదాయంలో ఇందులో కొంతమొత్తాన్ని ఈక్విటీ, ఎస్క్రో రూపంలో వినియోగించుకోవడానికీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
974 కిలోమీటర్ల మేర ఉన్న తీర ప్రాంతాన్ని వాణిజ్య పరంగా అభివృద్ధి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి తీర ప్రాంతంలో ఓడరేవులను నిర్మిస్తామని హామీ ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో భావనపాడును నిర్మించడంతో పాటు, విశాఖపట్నం జిల్లాలో గంగవరం పోర్ట్ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రీయల్, ఈస్ట్కోస్ట్ ఎకనమిక్ కారిడార్లో భాగంగా తీర ప్రాంతాన్ని మౌలిక రంగంలో అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రతిపాదలను రూపకల్పన చేస్తోంది.