ఆ వలంటీర్ కుటుంబానికి రూ.50 లక్షలు: ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్
శ్రీకాకుళం: కరోనా వ్యాక్సిన్ తీసుకుని, మృత్యువాత పడిన వలంటీర్ పిల్లా లలిత కుటుంబానికి జగన్ ప్రభుత్వం భారీగా నష్టపరిహారాన్ని చెల్లించింది. 50 లక్షల రూపాయలను పరిహారంగా అందజేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులను జారీ చేశారు. ఆర్ వాసుదేవ రావుకు నష్ట పరిహారం మొత్తం చెల్లించాలంటూ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఈ మొత్తం విడుదలైంది.
నిమ్మగడ్డ విచక్షణాధికారాలకు చెక్: మంత్రి పెద్దిరెడ్డికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్ పిల్లా లలిత ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటలో ఆమె వలంటీర్గా పనిచేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఆమె కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం అనారోగ్యానికి గురయ్యారు. ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స అందించినప్పటికీ.. ఫలితం రాలేదు. ఆదివారం ఆమె మరణించారు. మృతురాలికి భర్త, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు.
వ్యాక్సిన్ వల్లే తమ కుమార్తె మరణించినట్లు తల్లి పార్వతమ్మ ఆరోపించారు. వ్యాక్సిన్ అనంతరం లలిత అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే జ్వరం సోకిందని, తగ్గకపోవడంతో మాత్రలు వేసుకున్నారని, అనంతరం నీరసించిపోయారని పేర్కొన్నారు. మరుసటి రోజే చనిపోయినట్లు తెలిపారు. లలితకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండేవి కావని, వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే చనిపోయినట్లు ఆమె ఫిర్యాదు చేశారు.
వలంటీర్ మృతి విషయం తెలుసుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు పలాస కమ్యూనిటీ ఆసుపత్రికి వెళ్లి లలిత మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రెండు లక్షల రూపాయలను తక్షణ సహాయం కింద ప్రకటించారు. ఇక తాజాగా 50 లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. సీఎంఆర్ఎఫ్ నుంచి ఈ మొత్తాన్ని మృతురాలి కుటుంబానికి అందేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.