చెరువు మట్టి అక్రమంగా: తహశీల్దార్ను బెదిరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే: కేసు: అజ్ఙాతంలో
శ్రీకాకుళం: వేసవి ఎండల ధాటికి గ్రామానికి సాగునీటిని అందించే చెరువు ఎండిపోగా.. అందులో ఉన్న మట్టిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఈ తరలింపును అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానిక రెవెన్యూ అధికారులు, తహశీల్దార్పై బూతులతో విరుచుకుపడ్డారు. ఫోన్లో ఇష్టానుసారంగా మాట్లాడారు. లంచం అడిగావని ఎదురు కేసు పెడతాననీ బెదిరించారు. స్థానిక తహశీల్దార్ ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రతి ఇంటికీ మేనిఫెస్టో: ఎవరైనా కోర్టుకెళ్తారేమో: జగన్ సెటైర్: ఆ విషయాన్ని గట్టిగా నమ్ముతున్నా
శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. పొందూరు సమీపంలో ఎండిపోయిన చెరువులో నుంచి పెద్ద ఎత్తున మట్టిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారనే ఆరోపణలను కూన రవికుమార్ ఎదుర్కొంటున్నారు. గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో అక్రమంగా మట్టిని తవ్వి తీస్తున్నట్లు సమాచారం అందడంతో స్థానిక తహశీల్దార్ రామకృష్ణ.. తోటి రెవెన్యూ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కూన రవికుమార్ సోదరుడికి చెందినవిగా భావిస్తోన్న రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లను సీజ్ చేశారు.
ఈ ఘటన ఈ నెల 16వ తేదీన చోటు చేసుకుంది. అప్పటి నుంచి కూన రవికుమార్ జేసీబీలు, టిప్పర్లను విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారని, ఈ క్రమంలో తహశీల్దార్ రామకృష్ణను ఫోన్ చేసి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. సీజ్ చేసిన వాహనాలను వెంటనే విడిపించకపోతే.. అంతు చూస్తానని రవికుమార్ బెదిరించినట్లు రామకృష్ణ ఆరోపిస్తున్నారు. బెదిరింపులకు విసుగెత్తిన ఆయన పొందూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Recommended Video
రవికుమార్ను అరెస్టు చేయడానికి సోమవారం పోలీసులు ఆయన వెళ్లగా.. ఇంట్లో లేరని తేలింది. ఆయన కోసం గాలించగా ఫలితం రాలేదు. ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. కూన రవికుమార్ అజ్ఙాతంలోకి వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆయన కోసం గాలిస్తున్నామని చెెప్పారు. కూన రవికుమార్ తనను చాలాసార్లు దుర్బాషలాడారని రామకృష్ణ ఆరోపించారు. ఆయనపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ను జారీ చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.