డీజీపీ వ్యాఖ్యలపై బాబు అసహనం ... ప్రాణాలు పోతుంటే మాది మీడియా షో అంటారా?
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల డీజీపీపై చేసిన వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. పోలీసు వ్యవస్థను కించపరుస్తున్నారని వైసీపీ నేతలు చంద్రబాబుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇక డీజీపీ కూడా చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించారు. కానీ ఎక్కడా పార్టీ పేర్లు ప్రస్తావించకుండా ఆయన స్పందించారు. తాను ప్రజా సేవకుడిని మాత్రమేనని చెప్పుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ తనకు రాజకీయంగా ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేసారు.
వైయస్సార్ భయపడి వెనుకడుగు..అభినందించాలి: జగన్ అహంకారంతో..ఇలా: చంద్రబాబు ఫైర్..!
ఆ పార్టీది మీడియా షో అన్న డీజీపీ వ్యాఖ్యలపై బాబు ఫైర్
ఇక ఆ పార్టీది మీడియా షో అంటూ వ్యాఖ్యానించారు. తనకు లేఖ రాశామంటూ మీడియాకు విడుదల చేస్తున్నారని ఆ తరువాత ఆ లేఖను ఆ పార్టీ నాయకులు లేఖను అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. పోలీసులపైన ఆ పార్టీ నాయకులు చేస్తున్నవి రాజకీయపరమైన ప్రకటనలు మాత్రమేనని డీజీపీ చెప్పారు. తమ వద్దకు వచ్చిన ఏ అంశం పైనైనా తగిన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ స్పష్టం చేసారు. ఇక తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై మరోమారు చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
నేను తప్పు చెయ్యలేదు .. ఎవరికీ భయపడను అన్న బాబు
శ్రీకాకుళం జిల్లాలో పార్టీ సమీక్షా సమావేశానికి హాజరైన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. జగన్ తీరు, వైసీపీ ప్రభుత్వ విధానాలతో పాటు డీజీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నేతలు ప్రాణాలు పోతుంటే డీజీపీ మాత్రం మీడియా షో అంటారా? అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇక కార్యకర్తల త్యాగాలు మరిచిపోలేనని పేర్కొన్న ఆయన కార్యకర్తల ప్రాణాలకు తన ప్రాణం పణంగా పెడతానన్నారు. అంతే కాదు నేను తప్పు చేయలేదు ఎవరికీ భయపడను అని పేర్కొన్నారు. జగన్ తండ్రి వై ఎస్ ఆర్ తన మీద 26 కేసులు వేశారు కానీ ఏం సాధించారని ప్రశ్నించారు చంద్రబాబు .
వైసీపీ ప్రభుత్వం శాశ్వతం కాదని పోలీసులకు బాబు హితవు
పోలీసులు ప్రస్తుత వైసీపీ సర్కార్ శాశ్వతం కాదని గ్రహించాలన్నారు చంద్రబాబు. మైనింగ్ మాఫియాకు గనులు ఇచ్చిన వ్యక్తి జగన్కు సలహాదారుడుగా ఉన్నారు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రజావేదిక కూల్చివేతతోనే వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని చంద్రబాబు వైసీపీ సర్కార్ పై ఫైర్ అయ్యారు. పేదవాడికి రూ.5కే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసేశారని మాపై విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఇసుకాసురులుగా మారారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీపావళి వస్తుంది కానీ వెలుగులు లేవన్న బాబు
ఇసుక పేదవాడికి దొరకదు కానీ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లకు తరలి వెళ్తుంది అంటూ మండిపడ్డారు చంద్రబాబు. 32 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పస్తులుంటున్నారు. పనులు లేక రోడ్డున పడ్డారని ఆయన అన్నారు. విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందన్న జగన్కు కోర్టు కర్రకాల్చి వాతలు పెట్టింది అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దీపావళి వస్తుంది కానీ రాష్ట్రంలో వెలుగులు లేవన్నారు మాజీ సీఎం చంద్రబాబు . రాష్ట్రంలో కరెంట్ కోతలు పెరిగిపోయాయని ఆయన మండిపడ్డారు. అస్తవ్యస్త పాలన సాగుతుందని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తామని పేర్కొన్న చంద్రబాబు,గ్రామ స్థాయి నుంచి సమర్ధవంతమైన నాయకత్వం రావాలని పిలుపునిచ్చారు.