వామ్మో.. ఇదేమి రాజ్యం, ఇళ్ల పట్టా అడగడం కూడా తప్పేనా..? దళిత యువకుడిని తన్నిన సీఐ..(వీడియో)
ఆంధ్రప్రదేశ్లో దళితులపై వరసగా దాడులు జరుగుతున్నాయి. కిరణ్, వరప్రసాద్.. ఇప్పుడు మర్రి జగన్ అధికార పార్టీ నేతలు, లేదంటే పోలీసుల చేతిలో దాడికి గురైన బాధితులు. సిక్కోలు జిల్లాకు చెందిన జగన్ను కావరం ఎక్కిన సీఐ ఒకరు కాలితో తన్ని తన బుద్దిని ప్రదర్శించారు. ఆ వీడియో బయటకు రావడంతో తెగ వైరలవుతోంది. మరోవైపు జగన్పై దాడిని టీడీపీ నేత నారా లోకేశ్ ఖండించారు. రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కులేదా అని ఆయన మండిపడ్డారు.
ఇళ్ల పట్టాలు అడిగితే..
శ్రీకాకుళం జిల్లా టెక్కలిపట్నం గ్రామానికి చెందిన మర్రి జగన్ దళిత యువకుడు. ఆయన ఇంటి పట్ట కోసం వైసీపీ నేతలను నిలదీశాడు. ఇంకేముంది అధికార అండతో వారు రెచ్చిపోయారు. జగన్పై పిడి గుద్దులు కురిపించారు. అన్యాయంగా తనను కొట్టారని పోలీసు స్టేషన్ వద్దకు వచ్చాడు. పలాస పోలీసు స్టేషన్ వద్దకు రాగా.. అప్పటికే సీఐ వేణుగోపాల్తో అధికార పార్టీ నేతలు మాట్లాడినట్టు ఉన్నారు. ఇంకేముంది బడుగు, బలహీనవర్గానికి చెందిన యువకుడిపై సీఐ తన ప్రతాపం చూపించాడు.
ఫిర్యాదు చేయడానికి వస్తే తన్నిన సీఐ
వైసీపీ నేతలు తనపై దాడి చేశారని ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువకుడికి చుక్కెదురైంది. పైగా యువకుడిని సీఐ వేణుగోపాల్ కాలితో దన్నాడు. అది కెమెరాలో రికార్డయ్యింది. తర్వాత దాడికి తెగబడ్డాడు. యువకుడి తల్లి ముందే సీఐ తనకున్న అధికారంతో రెచ్చిపోయాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ యువకుడు మాత్రం ఏమీ చేయలేకపోయాడు. అతని తల్లి కూడా వద్దు అని వారిస్తోన్నా.. సీఐ వినిపించుకోలేదు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సీఐ వేణుగోపాల్పై సస్పెన్షన్ వేటు వేశారు.
జీవించే హక్కు లేదు..
జగన్పై సీఐ దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. సీఎం జగన్ పాలనతో దళితులకు జీవించే హక్కు లేదా అని ప్రశ్నించారు. మాస్క్ పెట్టుకోలేదని దళిత యువకుడు కిరణ్ని కొట్టి చంపారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుపడ్డాడని వరప్రసాద్కి శిరోముండనం చేశారు. ఇప్పుడు ఇళ్ల పట్టా అడిగితే మర్రి జగన్ పై దాడి చేశారు. ఇదేం పద్ధతి అని ప్రశ్నల వర్షం కురిపించారు.
పోలీసులా.. వైసీపీ నేతలా...?
రాష్ట్రంలో పోలీసులు కూడా వైసీపీ నేతల్లా వ్యవహరిస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. అలా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బలహీనవర్గాలు అంటే ప్రభుత్వానికి మొదటి నుంచి చిన్నచూపే అని ఆరోపించారు. వరసగా దళితులపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనం అని ఉదహరించారు.
Recommended Video
బ్రతకడం కోసం పోరడాల్సి వస్తోంది..
ఘటనను టీడీపీ అనిత కూడా ఖండించారు. దళితులను హింసించే బదులు వరుసగా నిలబెట్టి కాల్చేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు. మా బాధలు చెబితే మీఅనుచరులు తిడుతున్నారు. కొడుతున్నారు.. కానీ దీనిపై మీరు మాత్రం మీరు నోరు విప్పరు అని మండిపడ్డారు. మీ పాలనలో దళితులకు బ్రతికే హక్కు లేదా అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం ఆరాటపడే దళిత జాతి మీ పాలనలో బ్రతకడాని కోసం పోరాడాల్సి వస్తుందని దుయ్యబట్టారు.